హైదరాబాద్, జూలై 15 : భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటవుతున్నది. 202 ఎకరాల్లో అతిపెద్ద హైపర్స్కేల్ డాటా సెంటర్ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్మించనుండగా, దీనికి సంబంధించి జరిగిన భూమి పూజలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కంపెనీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వచ్చే పదేండ్లలో తెలంగాణలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ముందుకొచ్చింది. కాగా, చందన్వెల్లిలో మరో డాటా సెంటర్ ప్రాజెక్టు కోసం కూడా ప్రభుత్వం అమెజాన్కు 98 ఎకరాలను కేటాయించింది. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 2034కల్లా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాల్సిందిగా అమెజాన్ను కోరారు.
ఇదిలావుంటే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులోనే అమెజాన్ డాటా సెంటర్ వస్తుండటంతో.. ఇది మరిన్ని గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలను ఆకర్షించగలదని, పెద్ద ఎత్తున అనుంధ రంగాల పెట్టుబడులను తీసుకురాగలదన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఈ డాటా సెంటర్తో మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగావకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోగలవన్న విశ్వాసాన్నీ వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.