న్యూఢిల్లీ, జూన్ 13: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్తో తమ పెట్టుబడి లావాదేవీల వ్యవహారంలో అమెజాన్ అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) సోమవారం తోసిపుచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గతంలో అమెజాన్పై విధించిన జరిమానాను కూడా సమర్థించింది. 45 రోజుల్లోగా రూ.200 కోట్ల జరిమానాను డిపాజిట్ చేయాలని అమెజాన్ను ఆదేశించింది. కాగా, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) అనుబంధ సంస్థ ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సీపీఎల్)లో 49 శాతం వాటాను అమెజాన్.కామ్ అనుబంధ సంస్థ అమెజాన్.కామ్ ఎన్వీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇది ఎఫ్ఆర్ఎల్లో 9.82 శాతం వాటాకు సమానం. ఈ క్రమంలోనే ఎఫ్ఆర్ఎల్లో తమకూ భాగస్వామ్యం ఉందంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ గ్రూప్నకు మధ్య జరిగిన రూ.24,713 కోట్ల డీల్కు అమెజాన్ అడ్డు తగులుతున్నది. అయితే ఎఫ్ఆర్ఎల్లో ఉన్న వాటాకు సంబంధించి ఎఫ్సీపీఎల్లో పెట్టుబడుల సమయంలో ఏ ఆధారాలు లేవంటూ అమెజాన్ వాదన చెల్లదని సీసీఐ చెప్తున్నది. రూ.200 కోట్ల ఫైన్ వేసింది. దీన్ని సవాల్ చేస్తూనే అమెజాన్ ఎన్సీఎల్ఏటీకి వెళ్లింది.