న్యూఢిల్లీ : సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్ దిగ్గజం మెటా తర్వాత దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతుండటంతో ఖర్చులకు కత్తెర వేస్తోంది. 2022లో మిగిలిన కాలానికి రిటైల్ బిజినెస్లో నియామకాలను కంపెనీ నిలిపివేసిందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది.
విక్రయాలు మందగించడంతో వరల్డ్వైడ్ అమెజాన్ స్టోర్స్ డివిజన్లో కార్పొరేట్ నియామకాలకూ ఈ నిబంధన వర్తించనుంది. అయితే వేర్హౌస్ నెట్వర్క్తో పాటు అమెజాన్ వెబ్ సర్వీస్పై ఈ నిర్ణయం ప్రభావం చూపదని, ఆయా విభాగాల్లో హైరింగ్ కొనసాగుతుందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. తమ వేర్వేరు బిజినెస్ విభాగాల్లో హైరింగ్ వ్యూహాలను సర్ధుబాటు చేస్తామని అమెజాన్ ప్రతినిధి బ్రాడ్ గ్లసర్ వెల్లడించారు.
గూగుల్ వంటి టెక్ దిగ్గజాల తరహాలో అమెజాన్ సైతం ఉక్రెయిన్ వార్ వంటి ప్రస్తుత అంతర్జాతీయ ఆర్ధిక పరిస్ధితులను క్షుణ్ణంగా గమనిస్తోంది. ఆర్ధిక మందగమనం నేపధ్యంలో గూగుల్ ఇటీవల తమ ఉద్యోగుల ట్రావెల్, వినోద బడ్జెట్లలో కోత విధించిన సంగతి తెలిసిందే. ఆ తరహా వ్యయ నియంత్రణ చర్యలకు అమెజాన్ మొగ్గుచూపవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గూగుల్, మెటా వంటి టెక్ కంపెనీలు తాజా నియామకాలను నిలిపివేస్తున్నట్టు ఇటీవల సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే.