Amara Raja Group | హైదరాబాద్, ఆగస్టు 16: అమర రాజా.. నూతన విభాగంలోకి అడుగుపెట్టబోతున్నది. ఇప్పటికే వాహనాలకు బ్యాటరీలు అందిస్తున్న సంస్థ..తాజాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తొలుత చార్జర్లు, ఆ తర్వాత బ్యాటరీలను తయారుచేసిన తర్వాతి క్రమంలో ఈవీలను రూపొందించనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్యా గౌరినేని తెలిపారు.
సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో లిథియం-అయాన్ బ్యాటరీ విభాగం నుంచి ఐదు శాతం వరకు సమకూరుతున్నదని, భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.10 వేల కోట్ల రాబడిని ఆర్జించిన విషయం తెలిసిందే. మరోవైపు, త్వరలో అందుబాటులోకిరానున్న అతిపెద్ద లిథియం సెల్, బ్యాటరీల తయారీ కేంద్రంలో ఉత్పత్తి సామర్థాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పెంచుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.