స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): 90 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఎయిరిండియా సంస్థ గడిచిన రెండు దశాబ్దాల్లో విపరీతమైన నష్టాలను నమోదు చేసినట్టు బీజేపీ సర్కారు గగ్గోలు పెట్టింది. రూ. 60 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్న ఎయిరిండియాను నడుపడం తమకు సాధ్యంకాదంటూ రూ. 18 వేల కోట్లకు బిడ్డింగ్ వేసిన టాటా సన్స్కు కారుచౌకగా కట్టబెట్టింది. అయితే, వేల కోట్ల అప్పుతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ ఎందుకు కొనుగోలు చేసింది? బిడ్డింగ్ పూర్తయిన ఏడాది తిరక్కుండానే ఎయిరిండియా కోసం ఏకంగా 500 కొత్త విమానాలకు ఆర్డర్ ఇవ్వడమేంటి? అసలు, ఎయిరిండియా నష్టాలు నిజమేనా? లేక, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ బంగారు బాతును తెగనమ్మడానికి డ్రామాలు చేసిందా? ఓ ప్రైవేట్ గ్రూపు ఎయిరిండియాను వృద్ధిపథంలోకి తీసుకెళ్లడానికి ప్లానింగ్తో ముందుకు వెళ్తుంటే, కేంద్రప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోయింది? ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’లో ప్రచురితమైన ఓ కథనం ఇవే అనుమానాలకు తావిస్తున్నది.
పాతికేండ్ల పాపమిది
172 అత్యుత్తమ శ్రేణి విమానాలు, 10 వేల మంది ఉద్యోగులు, రూ. 60 వేల కోట్ల స్తిర, చరాస్తులు ఎయిరిండియా సొంతం. 1994 కంటే ముందువరకూ విమానయానరంగంలో ఎయిరిండియానే మహారాజు. అ యితే, 1994-95లో ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించడంతో పోటీ పెరిగిం ది. 1998 తర్వాత ముఖ్య విమానాశ్రయాల్లో రద్దీ సమయాల్లో ఎక్కువ స్లాట్లను ప్రైవేట్ విమానయాన సంస్థలకు అప్పటి ఎన్డీయే సర్కారు అడ్డగోలుగా కేటాయించింది. దీంతో ఎయిరిండియాకు నష్టాలు మొదలయ్యా యి. ఈ సాకుతో సంస్థలోని 40 శాతం వాటాను విక్రయించాలని 2000-01లో వాజ్పేయీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రయత్నించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో అది నిలిచిపోయింది. 2014లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ హయాం లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ప్రైవేటు కంపెనీలు చౌక టికెట్లను ఆఫర్ చేయ డం ఒకవైపు, ప్రభుత్వానికి సరైన వ్యాపార విధానం లేకపోవడం, అతి నియంత్రణ, రూ. వేల కోట్లలో పేరుకుపోయిన వీవీఐపీల ప్రయాణ చార్జీల బకాయిలు.. వెరసి ఎయిరిండియాకు కష్టాలు పెరిగాయి. సంస్థను గట్టెక్కించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కార్పొరేట్లకు మేలు చేకూర్చడానికే కేంద్రప్రభుత్వం ఎయిరిండియాను తెగనమ్మినట్టు ఉద్యోగులు, విపక్షాలు మండిపడ్డాయి.
లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నదని ‘వాషింగ్టన్ పోస్ట్’ అభిప్రాయపడింది. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సీసీఐ, సెయిల్ తదితర కంపెనీల విక్రయప్రక్రియను ఈ మేరకు ఉదహరించింది. కొనుగోలుదారులు, కంపెనీల పూర్వ చరిత్రను, అవి చేసిన ఆర్థిక అవకతవకలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం హడావుడిగా విక్రయాలను జరిపి చతికిలపడిన సందర్భాలను కూడా పత్రిక ప్రస్తావించింది. పవన్హన్స్ విక్రయప్రక్రియకు బ్రేకులు పడటాన్ని ఈ మేరకు ఉదహరణగా వివరించింది.
ఎయిరిండియాను అగ్గువసగ్గువకు అమ్మేసిన బీజేపీ ప్రభుత్వం.. దాని అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్), ఎయిర్లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ (అలయెన్స్ ఎయిర్), ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (హెచ్సీఐ)లను కూడా విక్రయించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు రోడ్డు షోను ఇప్పటికే నిర్వహించిన సర్కారు.. క్యాబినెట్ అనుమతిని కూడా పొందింది. ఈ అనుబంధ సంస్థల కొనుగోలు రేసులో ప్రముఖ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే, దేశంలోని ప్రముఖ ఎయిర్పోర్టులను మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన అదానీకి కట్టబెట్టిన కేంద్రం.. ఎయిరిండియా అనుబంధ సంస్థలను కూడా ఆ గ్రూప్నకే విక్రయించవచ్చన్న వాదనలు ఉన్నాయి.
ఎయిరిండియాను విక్రయించనున్నట్టు 2017లో బీజేపీ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రకటనకు ముందే సంస్థకు వస్తున్న నష్టాలను ఎక్కువ మొత్తంలో చూపించే ప్రయత్నం చేసినట్టు సంస్థ ఉద్యోగులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే, ఈ వాదనను కొట్టిపారేసిన ప్రభు త్వం.. తగిన ఆధారాలను మాత్రం చూపించలేకపోయింది. ఇక, రూ. 60 వేల కోట్ల అప్పు ల్లో ఉన్న ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. దీనికి కారణాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ తదితర ప్రాంతాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శాశ్వత టెర్మినల్స్, పార్కింగ్ స్లాట్లు అదనం. భారత్కు చెందిన మరే ఇతర ప్రైవేటు విమానయాన సంస్థకు ఈ వెసులుబాట్లు లేవు. 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్ వనరులు, వీటికితోడు ఎయిరిండియా గుడ్విల్ను కలుపుకొంటే సంస్థ విలువ రూ. 3.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణుల అంచనా. అయితే, ప్రాథమికంగా ఎయిరిండియా ధరను రూ. 12,906 కోట్లు అనంతరం రూ. 17 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 18 వేల కోట్లకు ఎక్కువగా కోట్ చేసిన టాటా గ్రూప్నకు మహారాజాను కేంద్రం కట్టబెట్టింది. ప్రత్యేక టెర్మినల్స్, అత్యుత్తమ శ్రేణి వసతులు, ల్యాండింగ్ వనరులు ఉన్న ఎయిరిండియా టాటా గ్రూప్నకు బంగారు బాతుగా కనిపించింది. అందుకే, ఎయిరిండియా విస్తరణలో భాగంగా 500 విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ఇటీవల ప్రకటించింది. అంతేనా, తమ ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా ఎయిన్లైన్స్ను కూడా ఎయిరిండియా గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, లక్షల కోట్ల విలువైన ఎయిరిండియాను నష్టాల సాకుతో అగ్గువసగ్గువకు కేంద్రం వదిలించుకోవడం జాతి సంపదను దోచిపెట్టడమేనన్న విమర్శలు వస్తున్నాయి.
1932 ప్రారంభించిన సంవత్సరం
1953 జాతీయీకరించిన సంవత్సరం
172 మొత్తం విమానాలు
1200 కోట్లు సగటున ఒక్కో విమానం ఖరీదు
2,06,400 కోట్లు విమానాల మొత్తం విలువ
60,000 కోట్లు సంస్థకు ఉన్న స్తిర, చరాస్థుల విలువ
అన్నీ కలిపి కంపెనీ మొత్తం విలువ (అంచనా) 3.5 లక్షల కోట్లు
కొనుగోలుకు టాటా గ్రూప్ వెచ్చించిన మొత్తం18,000 కోట్లు
ఈ విక్రయంతో జాతిసంపదకు కలిగిన నష్టం 3.3 లక్షల కోట్లు