హైదరాబాద్, సెప్టెంబర్ 11(బిజినెస్ బ్యూరో): రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దేశీయ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ అల్లానా గ్రూపు..దేశంలో అతిపెద్ద పెట్ ఫుడ్ ప్లాంట్ను జహీరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంట్ ఆసియాలో అతిపెద్ద యూనిట్ కావడం విశేషం. దేశీయంగా తన వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు నూతన ప్రొటిన్ ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ సీఈవో రాఘవేంద్ర రావు తెలిపారు.
10 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నిర్మించతలపెట్టిన ఈ యూనిట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నదని, తద్వారా వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. అధిక నాణ్యత కలిగిన పెట్ ఆహార ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నదన్నారు. ప్రస్తుతం సంస్థ ప్రాసెస్ ఫుడ్ ఉత్పత్తులు, ఆగ్రో కమోడిటీస్లు, ఫ్రొజెన్/చిల్ల్ మీట్, కూరగాయలు, కాఫీ, స్పైసెస్, చిరుధాన్యాలను ఉత్పత్త చేస్తున్నది. మధ్యప్రాచ్య, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రి కా, ఆస్ట్రేలియా దేశాలు కలుపుకొని 80 దేశాలకు పెట్ ఫుడ్స్ను ఎగుమతి చేస్తున్నది.