SBI Sarvottam Fixed Diposit | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారుల కోసం సరికొత్త డిపాజిట్ స్కీం ‘సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ (SBI Sarvottam Fixed Diposit) పథకం తెచ్చింది. ఇది నాన్-కాలబుల్ పిక్స్డ్ డిపాజిట్ పథకం. అంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ గడువు ముగియకముందే మధ్యలో విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలు అనుమతించవు. ఒకవేళ, తప్పనిసరి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకున్నా ఫైన్ చెల్లించడంతోపాటు వడ్డీ కూడా తగ్గిపోతుంది. ఇతర పెట్టుబడి, పొదుపు పథకాల్లో డిపాజిట్ల కంటే ఎస్బీఐ సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడిపై ఎక్కువ వడ్డీ ఆదాయం పొందొచ్చు.
సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద కనిష్టంగా రూ.15 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు జమ చేయొచ్చు. ఈ పథకం కింద ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి 7.1-7.9 శాతం మధ్య వడ్డీరేటు లభిస్తుంది. రెండేండ్ల గడువుతో ఈ స్కీమ్లో డిపాజిట్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిపికెట్ (ఎన్ఎస్సీ), ఇతర పోస్టాఫీసు డిపాజిట్ పథకాలతో పోలిస్తే సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ ఎక్కువే లభిస్తుంది.
సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద జమ చేసే డిపాజిట్లను గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేయడానికి నిబంధనలు అనుమతించవు. గడువు ముగిసిన వెంటనే వడ్డీతోపాటు సంబంధిత వ్యక్తి సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. సాధారణంగా ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్లపై మూడు నుంచి 7.5 శాతం వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది. అయితే సంబంధిత ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు, డిపాజిట్ చేస్తున్న మొత్తం ఆధారంగా వడ్డీరేటు ఖరారవుతుంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తుంది.
సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద వడ్డీరేట్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఏడాది లోపు గడువుపై రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల లోపు గడువు గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది.
ఏడాది గడువుతోపాటు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేస్తే సాధారణ పౌరులు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లు 7.55 శాతం వడ్డీ పొందవచ్చు. రెండేండ్ల లోపు గడువు గల డిపాజిట్లపై సాధారణ వ్యక్తులు 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది.
ఇటీవలే ఎస్బీఐ రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది. రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు, ఐదేండ్ల నుంచి పదేండ్లలోపు టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం, 400 రోజుల గడువు గల స్పెషల్ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీంపై సాధారణ పౌరులకు 7.1, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ అందిస్తున్నది.
వివిధ బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్ పథకాలపై వడ్డీరేట్లు.. ఎస్బీఐ ప్రతిపాదిత సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్ స్కీం కంటే తక్కువగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)పై ప్రస్తుతం 7.2 శాతం వడ్డీ మాత్రమే లభిస్తున్నది. ఏడాదిలో రూ.1.5 లక్షలు మాత్రమే పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయొచ్చు. ఎస్బీఐ సర్వోత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కంటే పీపీఎఫ్లో డిపాజిట్లపై వడ్డీ తక్కువ.
పోస్టాఫీసులోని ఐదేండ్ల పోస్టాఫీసు టైం డిపాజిట్లపై మీరు ఏడు శాతం వడ్డీరేటు పొందొచ్చు. ఏడాది గడువు గల టైం డిపాజిట్పై 6.6 శాతం, రెండేండ్ల గడువు గల టైం డిపాజిట్పై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది.
ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)లో డిపాజిట్లపై ఏడాదికి ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కింద డిపాజిట్లు ఐదేండ్లు కొనసాగించాలి. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) డిపాజిట్లపై ప్రస్తుతం ఏడాదికి 7.2 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. ఈ పథకంలో డిపాజిట్లపై 120 నెలలకు రెట్టింపు రిటర్న్స్ లభిస్తాయి.