వాషింగ్టన్, అక్టోబర్ 11: ఆర్థిక వేత్తలు, కేంద్ర బ్యాంక్లు, పలు ప్రపంచ ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్న మాంద్యం భయాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తాజాగా ధృవపర్చింది. అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన కట్టడితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మాంద్యంలో చిక్కుకుంటుందని హెచ్చరించింది. రికార్డు గరిష్ఠస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచడం, ద్రవ్య సరఫరాను తగ్గించడం వంటి చర్యలు చేపట్టడంతో ఈ ఏడాది మధ్యలోనే మాంద్యం భయాలు తలెత్తాయని మంగళవారం విడుదల చేసిన గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్ట్లో ఐఎంఎఫ్ వివరించింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సాధారణ స్థాయికంటే అధికంగా పెంచిన ప్రతీసారీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఆవరిస్తుందని గుర్తుచేసింది. ‘అంతర్జాతీయ ఆర్థిక వాతావరణాన్ని కారుమబ్బులు కమ్ముకుంటున్నాయ్. ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్ఠానికి ఎగబాకింది. అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతున్నది. పలు దేశాల్లో ఆర్థిక పరిస్థితి హీనమవుతున్నది. ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వ్యాపించివున్నాయ్’ అంటూ ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది.
భారత్ వృద్ధికి భారీ కోత
పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు భారత్ వృద్ధి రేటు అంచనాలకు వరుసపెట్టి కోతపెడుతున్న రీతిలోనే తాజాగా ఐఎంఎఫ్ భారీగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత్ జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పరిమితమవుతుందని రిపోర్ట్లో ఐఎంఎఫ్ ప్రకటించింది. వచ్చే ఏడాది వృద్ధి 6.1 శాతం ఉంటుందన్నది. ఇదే సంస్థ ఈ ఏడాది జూలై నెలలో ఈ వృద్ధి రేటును 7.4 శాతం అంచనా వేయగా, ఇప్పుడు అందులో 60 బేసిస్ పాయింట్లు కుదించింది. 2022 ఏప్రిల్లో అంచనా 8.2 శాతంగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థికాభివృద్ధి 8.7 శాతంకాగా, ప్రస్తుత ఏడాది ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 1.9 శాతం మేర వృద్ధి తగ్గనుంది. విదేశాల్లో వస్తూత్పత్తులకు డిమాండ్ బలహీనపడినందున, ఈ ద్వితీయ త్రైమాసికంలో భారత్ జీడీపీ గణనీయంగా తగ్గుతుందని తెలిపింది.
2001 తర్వాత ఇదే బలహీన వృద్ధి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022లో 3.2 శాతానికి పరిమితమవుతుందని, 2023లో ఇది 2.7 శాతమే ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2001 తర్వాత వృద్ధి ఇంతగా బలహీనపడటం ఇదే ప్రధమమని తెలిపింది. 2021లో అంతర్జాతీయ వృద్ధి 6 శాతంగా ఉంది. 2022 ప్రధమార్థంలో యూఎస్ జీడీపీ తగ్గుతుందని, ద్వితీయార్ధంలో యూరప్ జోన్ ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేస్తుందని రిపోర్ట్లో వివరించింది. కొవిడ్-19 వేవ్స్, లాక్డౌన్స్ కొనసాగడం, రియల్టీ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో చైనా వృద్ధి సైతం దెబ్బతింటుందని, దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఐఎంఎఫ్ వివరించింది.
మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన యూఎస్, యూరోపియన్ యూనియన్, చైనాల వృద్ధి స్తంభించిపోతుందని, మూడో వంతు ప్రపంచంలో మాంద్యం ఆవరిస్తుందని, 2023లో ప్రపంచ ప్రజలంతా మాంద్యంలో ఉన్నట్టే భావిస్తారని ఐఎంఎఫ్ రీసెర్చ్ డైరెక్టర్ పియరీ ఒలివర్ హెచ్చరించారు.ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తుందని, వచ్చే ఏడాది అమెరికా వృద్ధి రేటు 1 శాతానికి తగ్గుతుందని, చైనా జీడీపీ రేటు 4.4 శాతానికి పరిమితమవుతుందని తెలిపారు. కేంద్ర బ్యాంకులు ద్రవ్యవిధానాన్ని కఠినతరం చేస్తున్నందున వడ్డీ వ్యయాలు పెరిగి హౌసింగ్ మార్కెట్లు దెబ్బ తింటాయన్నారు.