వనపర్తి : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణపై పోలీసు అధికారులు, సిబ్బందితో వనపర్తి సంగం పంక్షన్ హాలులో ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, పోలింగ్ ముగిసిన తర్వాత పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంకు తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 31 పోలింగ్ కేంద్రాలకు గాను 6 రూట్లను ఏర్పాటు చేసి 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనపు ఎస్పీ౼1, డీఎస్పీలు౼ 01, సీఐలు౼ 04, ఎస్ఐలు- 18, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, హోమ్ గార్డులతో పాటు ఏఆర్ సిబ్బంది మొత్తం 250 మంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వనపర్తి డీఎస్పీ కె.ఎం. కిరణ్ కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూర్ సీతయ్య, జిల్లాలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.