Alibaba | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దాదాపు, 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. చైనాలో వృద్ధిరేటు మందగించడంతోపాటు విక్రయాలు తగ్గిపోయాయి. పొదుపు చర్యలు చేపట్టడంలో భాగంగా అలీబాబా యాజమాన్యం ఉద్యోగాల్లో కోత పెట్టింది. గత నెలతో ముగిసిన త్రైమాసికంలో 9,241 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొన్నది. దీంతో అలీబాబా సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు తగ్గింది. ఆరేండ్ల తర్వాత అలీబాబా యాజమాన్యం.. ఉద్యోగులను తొలగించివేయడం ఇదే తొలిసారి. గమ్మత్తేమిటంటే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం.
అయితే అలీబాబా ఈ-కామర్స్ సేల్స్ భారీగా తగ్గిపోవడం వల్లే ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల ఉద్వాసనకు ప్రధాన కారణమని తెలియవచ్చింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 22.74 బిలియన్ల యువాన్ల విక్రయాలు జరిపింది. గతేడాది 45.14 బిలియన్ల యువాన్ల విలువైన వస్తువుల విక్రయం సాగింది.
గతేడాదితో పోలిస్తే గత నెలతో ముగిసిన త్రైమాసికంలో సేల్స్ సగానికి తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే అలీబాబా పొదుపు చర్యలు చేపట్టిందని తెలుస్తున్నది. రెండేండ్ల క్రితం ప్రభుత్వంపైనా, నియంత్రణ సంస్థలపైనా అలీబాబా ఫౌండర్ జాక్మా విమర్శలు గుప్పించాక.. ఆయన సంస్థలపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపించాయి. అలీబాబా, ఆంట్ గ్రూప్లను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టాయి. అలీబాబా, ఆంట్ గ్రూప్ల యాజమాన్యం నుంచి జాక్మా తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.