Toyata for EV | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా వచ్చే తొమ్మిదేండ్లలో అంటే 2030 నాటికి 30 కొత్త విద్యుత్ కార్లను ఆవిష్కరించబోతున్నది. అంతే కాదు 2030 నాటికి 35 లక్షల ఎమిషన్ రహిత హైడ్రోజన్, విద్యుత్ వినియోగ కార్లను విక్రయించాలని నిర్ణయించింది. ఇంతకుముందు 20 లక్షల విద్యుత్, హైడ్రోజన్ వినియోగ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి కార్లను విక్రయిస్తున్నది.
బియాండ్ జీరో సిరీస్-బీజెడ్ సిరీస్ అనే పేరుతో విపణిలోకి విద్యుత్ కార్లను తీసుకొస్తున్నట్లున్న టయోటా అధ్యక్షుడు అకియో టయోడా చెప్పారు. వీటిల్లో ఎస్యూవీ కార్లతోపాటు అన్ని రకాల పికప్ ట్రక్లు, స్పోర్ట్స్ కార్లు ఉంటాయని తెలిపారు. లెక్సాస్ లగ్జరీ బ్రాండ్ కారును 2035నాటికి ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి విద్యుత్ కారుగా మారుస్తామన్నారు. విద్యుత్ కార్లలో వినియోగించే బ్యాటరీల పరిశోధన అభివృద్ధికి కేటాయించిన 13.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను కూడా 17.6 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు తెలిపారు.