న్యూఢిల్లీ, మే 17: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,008 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.759 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లుకు పైగా అధికమయ్యాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 22.3 శాతం అధికమై రూ.31,500 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.25,747 కోట్లుగా ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,16,547 కోట్ల ఆదాయంపై రూ.4,255 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా సీఈవో గోపాల్ మాట్లాడుతూ..భవిష్యత్తులోనూ మెరుగైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదన్నారు. మూడు కారణాలతో గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించినట్లు, వీటిలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడం, డిజిటల్, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారీగా పెట్టుబడులు పెట్టడం కలిసొచ్చిందన్నారు.