AirIndia Warns | ఇప్పుడంతా డిజిటల్ మీడియా.. ఆన్లైన్లోనే షాపింగ్.. ఫుడ్ ఆర్డర్.. క్యాబ్ బుకింగ్స్.. రైల్వే మొదలు బస్సు నుంచి విమానాల వరకు టికెట్ల బుకింగ్ అంతా డిజిటల్గానే సాగిపోతూ ఉంటుంది. దీనికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు.. అదే డిజిటల్ మీడియా వేదికగా అమాయకులను బుట్టలో వేసుకునేందుకు రకరకాల లింక్లు పంపి బురిడి కొట్టిస్తున్నాయి. ప్రత్యేకించి దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు టాటా సన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల పేరిట ప్రజలను మోసగించేందుకు పూనుకుంటున్నాయి. తాజాగా ఫ్రాడ్స్టర్ల జాబితాలోకి టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా (మహరాజా) వచ్చి చేరింది.
ఎయిరిండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అంటూ బూటకపు మెసేజ్ ప్రజల్లోకి పంపారు సైబర్ మోసగాళ్లు. ఒక క్వశ్చనీర్ (ప్రశ్నావళి)ని పూర్తి చేసిన వారికి విమాణ ప్రయాణ టికెట్లపై రూ.6000 రాయితీ పొందొచ్చునని ఆ బూటకపు మెసేజ్ సారాంశం. వివిధ సోషల్ మీడియా వేదికలపై సదరు మెసేజ్ హల్చల్ చేస్తున్నది.
ఎయిరిండియా 75వ వార్షికోత్సవం పేరిట సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న బూటకపు మెసేజ్పై మహరాజా సంస్థ యాజమాన్యం రియాక్టయింది. తమ సంస్థ పేరిట వచ్చే ఫ్రాడ్ లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను.. ప్రత్యేకించి విమాన ప్రయాణికులకు అలర్ట్ జారీ చేసింది. ఆ లింక్ల మాయలో పడొద్దని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిరిండియాను గతేడాది అక్టోబర్ 8న వేలం ద్వారా టాటా సన్స్ గెలుచుకున్నది. ఈ ఏడాది జనవరి 27న లాంఛనంగా ఎయిరిండియాను టేకోవర్ చేసింది.