Tata Air India | ఎయిరిండియాను గాడిలో పెట్టాలంటే టాటా సన్స్ వచ్చే ఐదేండ్లలో 500 కోట్ల డాలర్ల పై చిలుకు (సుమారు రూ.37,500 కోట్లు) ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో సంస్థ రుణ బకాయిలు, నష్టాల చెల్లింపునకు రూ.15 వేలు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి పెద్ద పీట వేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎయిరిండియాతో కలిపి ప్రస్తుతం టాటా సన్స్ ఆధీనంలో మూడు ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇలా మూడు వేర్వేరు సంస్థలకు బదులు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడం.. టికెట్ల ధరలు కనీసం 15 శాతం పెంచడం, నష్టాలొచ్చే రూట్లలో విమాన సర్వీసులు నిలిపేయడం వంటి చర్యలు చేపడితే గానీ ఎయిరిండియా లాభాల బాట పట్టదని అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బోయింగ్ 777 విమాన సర్వీసుల స్థానే.. అంతర్జాతీయ ఉత్పత్తులపై కేంద్రీకరించాలని చెబుతున్నారు.
ఇంజినీరింగ్ కాంట్రాక్టులతోపాటు సిబ్బంది హేతుబద్ధీకరణ టాటా సన్స్కు పెద్ద సవాల్గా పరిణమిస్తుందని ఏవియేషన్ నిపుణులు అంటున్నారు. 1953 ఆగస్టులో జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్లైన్స్ను జాతీయకరణ చేశాక 69 ఏండ్లకు తిరిగి టాటా సన్స్ గురువారం టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిరిండియా, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా మూడు టాటా సన్స్ ఆధీనంలో ఉన్నాయి. వీటి శక్తి సామర్థ్యాలను టాటా సన్స్ ముందుగా నిర్ధారించుకోవాలని ప్రపంచంలోనే అతి చౌక ఎయిర్లైన్స్ సంస్థ బోర్డు సభ్యుడు చెప్పారు.
గత మార్చి నాటికి ఎయిరిండియా నష్టాలు రూ.83,916 కోట్లు, ఏయిర్ ఏషియా ఇండియా నష్టాలు రూ.1532 కోట్లు, విస్తారా రూ.1612 కోట్ల నష్టాలను భరిస్తున్నది. ఇక టాటా సన్స్ ఎయిరిండియాతోపాటు ఇతర ఎయిర్లైన్స్ నష్టాలు, రుణాలకే భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. అలాగే విమానాల కొనుగోలుకు ఎక్కువ ఖర్చు చేయక తప్పకపోవచ్చు.
ఇక కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఏడాది వరకు ఎయిరిండియా ఉద్యోగులకు ఏడాది వరకు కొలువు గ్యారంటీ.. తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కింద వర్క్ ఫోర్స్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సిబ్బంది రేషనలైజేషన్ టాటా సన్స్కు పెద్ద గుదిబండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
సంస్థ నిర్వహణకు గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్ నుంచి చాలా మంచి సీఈవోను తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియాలో సమస్యల పరిష్కారానికి సదరు సీఈవో కనీసం 4-5 ఏండ్లు కొనసాగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎయిరిండియా లీజర్లు, సప్లయర్లకే ప్రభుత్వం అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తూ వచ్చింది. 21 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల లీజ్ అగ్రిమెంట్కు స్వస్తి పలకాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి పని చేయని బోయింగ్ 777 విమానాలపై టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.