TATA Gets Air India | అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తుది దశకు చేరుకున్నది. దీన్ని టేకోవర్ చేసేందుకు పలు సంస్థలు బిడ్లు దాఖలు చేసినా టాటా సన్స్ను ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే శుక్రవారం మీడియాకు చెప్పారు. టాటా సన్స్ బిడ్ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉందన్నారు.
1953లో జాతీయకరణ చేసిన తర్వాత 68 ఏండ్లకు తిరిగి టాటా చేతికి ఎయిర్ ఇండియా వెళ్లనున్నది. ఎయిర్ ఇండియాలో 100%, అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పూర్తిగా టాటాల సొంతం అవుతుంది. ఇక గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఎయిర్ ఇండియా శాట్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐఏహెచ్ఎల్)లో టాటా సన్స్కు 50 శాతం వాటాలు దక్కుతాయి.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి సంస్థ రుణ భారం రూ.61,562 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నది. బిడ్ గెలుచుకున్న టాటా సన్స్ అందులో రూ.15,300 కోట్లను చెల్లించాలి. మిగతా రూ.46,262 కోట్ల రుణభారం ఎయిరిండియా అసెట్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్)కు బదిలీ అవుతుంది. ఇక ఎయిర్ ఇండియాకు దేశీయంగా ఎయిర్పోర్టుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు 4,400, విదేశీ ప్రయాణానికి 1,800 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. విదేశాల్లో 900 స్లాట్లు ఉన్నాయి.
ఎయిర్ ఇండియా టేకోవర్ కోసం గత నెల 29న పలు సంస్థలు ఫైనాన్సియల్ బిడ్లు వేశాయి. బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాలి. ఇందుకోసం టాటా సన్స్, స్పైస్జెట్ అధిపతి అజయ్ సింగ్ కూడా ఆర్థిక బిడ్లు సమర్పించారు. భవిష్యత్ క్యాష్ ప్లో, బ్రాండ్ విలువ.. విదేశాల్లో స్లాట్ల ఆధారంగా మినిమం రిజర్వు ప్రైస్ రూ.12,906 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం టాటా సన్స్ బిడ్.. మినిమం రిజర్వు ప్రైస్ కంటే ఎక్కువగా ఉంది.
బిడ్ ప్రకారం టాటా సన్స్ తాను ప్రతిపాదించిన రూ.18,000 కోట్ల మొత్తంలో రూ.15,300 కోట్ల రుణాలను చెల్లించనున్నది. మిగతా రూ.2,700 కోట్ల నగదు ప్రభుత్వానికి చెల్లించనుంది. ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయడానికి టాటా సన్స్ ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చింది. దీని పునరుద్ధరణ సత్తా టాటా సన్స్కే ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.