AirIndia-ChatGPT | సెర్చింజన్ గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ స్టార్టప్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్జీపీటీ చాట్బోట్ ఒక సంచలనం. కార్పొరేట్ల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ వీలైన మేరకు దాని సేవలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (ఏఐ) కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరింది. ఏఐ చాట్బోట్ తాజా వర్షన్ జీపీటీ-4 సేవలను వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తున్టన్లు ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్. సంస్థ పనితీరు మెరుగు పరిచేందుకు జీపీటీ-4 సేవలను వినియోగించుకోతలపెట్టామని ఢిల్లీలో జరిగిన సీఏపీఏ ఇండియా ఏవియేషన్ సమ్మిట్-2023లో సోమవారం చెప్పారు. టెక్నాలజీ ప్రపంచంలో తుపాన్లా దూసుకొస్తున్న చాట్జీపీటీని జిమ్మిక్కుల కోసం వాడటం లేదని, ఎయిర్లైన్స్ సేవల విస్తరణకు మాత్రమే ఉపయోగిస్తామన్నారు. టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ మద్దతుతో పని చేస్తున్న ఓపెన్ ఏఐ స్టార్టప్ రూపొందించిన ఏఐ చాట్బోట్ చాట్జీపీటీ-4 సేవలను తమ సంస్థ వినియోగించుకుంటుందని చెప్పారు. కానీ పూర్తి వివరాలను క్యాంప్బెల్ విల్సన్ వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే, అమెరికాలోని కొన్ని నిర్దిష్ట రూట్లలో తాత్కాలికంగా విమాన సర్వీసులు తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. అమెరికాకు వారానికి ఆరు సర్వీసులు నడుస్తుండగా నేవార్క్, శాన్ఫ్రాన్సిస్కోలకు మూడేసి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. క్రూ సిబ్బంది కొరత వల్ల అమెరికాలోని నిర్దిష్ట రూట్లలో సర్వీసులు తగ్గిస్తామని ఆయన చెప్పారు. వచ్చే మూడు నెలల్లో బోయింగ్ 777 విమానాలను నడిపేందుకు 100 మంది పైలట్లు సిద్ధం అవుతారని, 1400 మంది క్రూ సిబ్బంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
వచ్చే రెండు, మూడు నెలల్లో ఎయిర్లైన్స్ సిబ్బంది దాదాపు 11వేల మందికి చేరుతుందని, వారిలో ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ స్టాఫ్ ఉంటారని క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. నష్టాల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను గతేడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా సన్స్ టేకోవర్ చేసింది. ఎయిర్ ఇండియాతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఏఐఏటీఎస్ఎల్లో 50 శాతం వాటా కూడా టాటా సన్స్ తీసుకున్నది. ఆ వెంటనే ఐదేండ్లలో ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తేవడానికి కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది.