Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్లకు శుభవార్త. పైలట్ల వేతనాలు రూ.15 వేల వరకూ పెంచడంతోపాటు రూ.1.8 లక్షల బోనస్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ వరకూ రూ.5,000 – 15,000 మధ్య వేతనాలు పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు మాత్రం వేతనాలు పెంచలేదు కానీ బోనస్ కింద రూ.42 వేల నుంచి రూ.1.8 లక్షలు చెల్లిస్తారని సమాచారం.
ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ రూ.60 వేల బోనస్, కమాండర్ రూ.1.32 లక్షలు, సీనియర్ కమాండర్ రూ.1.80 లక్షల బోనస్ అందుకోనున్నారు. దీంతోపాటు గ్రౌండ్ అండ్ సిమ్యులేటర్ శిక్షణలో ఆలస్యానికి పరిహారం కూడా చెల్లిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. పెంచిన వేతనం, బోనస్ కూడా జూన్ నెల వేతనంతో కలిపి చెల్లించే అవకాశాలు ఉన్నాయి.