AI Dues to AAI | ఎయిర్పోర్ట్ ఆఫ్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి గత సెప్టెంబర్ నాటికి ఎయిరిండియా రూ.2350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. మరో ఎయిర్లైన్స్ స్పైస్జెట్ రూ.185 కోట్ల బకాయి ఉందని చెప్పారు. ఇంకా అలయన్స్ ఎయిర్లైన్స్ రూ.109 కోట్లు, గో ఎయిర్ (ప్రస్తుతం గో ఫస్ట్) రూ.56 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని సోమవారం రాజ్యసభలో సభ్యుల ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా చెప్పారు. కొన్ని సంస్థలు బకాయిలు చెల్లించకపోవడంతో డీఫాల్ట్ అయ్యాయన్నారు.
తన క్రెడిట్ పాలసీకి అనుగుణంగా సంబంధిత విమానయాన సంస్థలను రుణ బకాయిల చెల్లింపుల కోసం నిరంతరం సంప్రదిస్తూనే ఉంటుందని మంత్రి వీకే సింగ్ తెలిపారు. రుణ బకాయిలను వసూలు చేసుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్లను నగదీకరించుకోవడం, పీనల్ ఇంటరెస్ట్ విధించడంతోపాటు చట్టబద్ధమైన చర్యలు చేపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏఏఐ 125కి పైగా విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది. తన విమానాశ్రయాల పరిధిలో ఆయా సంస్థల విమానాల ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తుంది.