Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సేవల విస్తరణకు దూకుడుగా ముందుకు సాగుతున్నది. కేంద్రం నుంచి సంస్థను టేకోవర్ చేసినప్పటి నుంచి తన ప్రణాళికల అమలు వేగవంతం చేసింది. ఇప్పటికే 1900 మందికి పైగా క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకున్నది. తాజాగా 900 మంది పైలట్లను నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
తమ విమాన సర్వీసుల విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకుంటామని తెలిపింది. ఎయిర్ ఇండియా విస్తరణ వ్యూహంలో భాగంగా ఇటీవల ప్రముఖ విమానాల తయారీ సంస్థలు ఎయిర్బస్, బోయింగ్ల వద్ద 470 విమానాల కొనుగోలు కోసం ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నది. ఈ విమానాలు వచ్చే ఏడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు డెలివరీ కానున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే విమానాలతో సేవలందించడానికి `మహారాజ`కు అదనపు సిబ్బంది అవసరం.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా 115 విమానాలతో సేవలందిస్తున్నది. ఈ ఏడాది ఎయిర్బస్ నుంచి ఏ350 విమానాలు ఆరు, బోయింగ్ నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 25 అందుబాటులోకి వస్తాయి. ఎయిర్ ఇండియా లోకాస్ట్ ఆర్మ్.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు బోయింగ్ 737 విమానాలు అందుబాటులోకి వస్తాయి.
అంతే కాదు.. లీజ్పై 36 విమానాలతో ఎయిర్ ఇండియా సేవలందించనున్నది. ఇప్పటికే బోయింగ్ 777 విమానాలు లీజ్పై అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇన్ఫ్లయిట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ప్రారంభంలో గణనీయ స్థాయిలో విమానాల కొనుగోలుకు సంస్థ ఆర్డర్ చేసిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ నెట్వర్క్ల పరిధిలో మరిన్ని విమానాలు నడుపాలని నిర్ణయించామన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ `ఏఐఎక్స్` (ఇంతకుముందు ఎయిర్ ఏషియా ఇండియా) ఆధ్వర్యంలోని దేశీయ రూట్లను రీ-అలైన్మెంట్ (re-alignment) చేయాల్సి ఉందని సందీప్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం, భవిష్యత్ ఎయిర్ ఇండియా వృద్ధిలో క్యాబిన్ క్రూ సిబ్బంది నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని చెప్పారు.
ఎయిర్ఇండియా సేవల విస్తరణకు మరింత మంది పైలట్లు, మెయింటెనెన్స్ ఇంజినీర్లను కూడా నియమించుకోవాలని యోచిస్తున్నామని సందీప్ వర్మ తెలిపారు. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు మహారాజా 1900 మందికి పైగా క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకున్నదన్నారు. వారిలో దాదాపు 1100 మందికి గత ఏడు నెలల్లో శిక్షణ ఇచ్చామని, గత మూడు నెలల్లో 500 మంది విధుల్లో చేరారని వెల్లడించారు.