Raghu Ram Rajan | భారత్లో యువతకు ఉద్యోగాల కల్పనపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నదని ఇటీవల అన్నారు. తాజాగా ఒక ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత్ వృద్ధిరేటులో అత్యధికం ఉద్యోగాల రహిత వృద్ధే ( jobless growth ) అని తేల్చేశారు. ఎకానమీలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాల కల్పన తప్పనిసరి అని అన్నారు.
అలాగని ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ లేదా కన్సల్టెంట్ కానవసరం లేదని రఘురామ్ రాజన్ ( Raghu Ram Rajan ) స్పష్టం చేశారు. కానీ యువత అర్హతకు తగిన ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ యువతకు విద్యాబోధనలో ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాలు బోధించడం లేదన్నారు. ఫలితంగా వైద్యవిద్య వంటి కోర్సుల కోసం భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తరహా ఉత్పాదక రంగం ఆధారిత వృద్ధిపై గుడ్డిగా ముందుకెళ్లడం సరి కాదన్నారు. సర్వీస్ రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. సేవారంగంలో మంచి వైద్యులు ఉన్నా.. విదేశాలకు వలస వెళుతున్నారన్నారు.
ప్రతి భారతీయుడికి ఉపాధి కల్పనకు దగ్గర దారులు లేవని ( Raghu Ram Rajan ) రఘరామ్ రాజన్ తేల్చేశారు. మన విద్యారంగంలో నైపుణ్య పునాదులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధిరేటు మెరుగ్గా ఉన్నా.. జనాభా దృష్ట్యా మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.