ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్
హైదరాబాద్: తగిన సమయం వచ్చినపుడే సంస్కరణల్ని అమలు చేయాలని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. వ్యవస్థలో ఉత్పాదకతను పెంచేందుకు సంస్కరణలు అవసరమేనని, వాటిని తీసుకొచ్చే సమయం కూడా కీలకమైనదేనన్నారు. హైదరాబాద్లోని ఇక్ఫాయి బిజినెస్ స్కూల్ లో ప్రసంగిస్తూ 1991 లో దేశ ఆర్థిక స్థితి సంక్షోభంలో పడినపుడు పలు సంస్కరణల్ని ప్రవేశపెట్టడం జరిగిందని, దీంతో విమర్శలు వెల్లువెత్తాయన్నారు. తాము ఐఎంఎఫ్కు అమ్ముడుపోయినట్లు పార్లమెంటులో విమర్శించారని, కానీ సంక్షోభం కారణంగా ఆ సంస్కరణల్ని తీసుకొచ్చినట్లు వివరించారు. ‘ఇప్పుడు మనం అలా చేయనక్కర్లేదు. ఎంతో చర్చ జరగాలి. ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి. అటుతర్వాతే సంస్కరణలతో ముందుకెళ్లాలి’ అని రంగరాజన్ వ్యాఖ్యానించారు.