Tata to semiconductors | భారత్తో సహా యావత్ ప్రపంచం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకు వచ్చే సంప్రదాయం టాటా సన్స్కు తొలి నుంచి ఉంది. అందునా సవాళ్లను ఎదుర్కోవడం టాటా గ్రూప్కు వెన్నతో పెట్టిన విద్య.. విపత్కర సమయంలో సరికొత్త రంగాలకు పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించిన నేపథ్యం ఈ గ్రూప్ది..
తాజాగా మరో సాహసోపేత సవాల్ను తలకెత్తుకునేందుకు సిద్ధమైంది.. టెక్నాలజీ రంగానికి ఎంతో కీలకమైన సెమీ కండక్టర్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు సంకేతాలిచ్చారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. సోమవారం జరిగిన ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో ఆయన ఈ సంగతి చెప్పారు.
5జీ ఎక్విప్మెంట్ తయారీ రంగంలోకి ప్రవేశించనున్నట్లు టాటా సన్స్ ఇటీవలే ప్రకటించింది. దీంతోపాటు పలు రకాల సంస్థల టేకోవర్తో టాటా డిజిటల్ బిజినెస్ బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. చిప్ల నిర్మాణంతో సెమీ కండక్టర్ల తయారీ ఇమిడి ఉంది.
సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరం కూడా. భారత్లో సెమీ కండక్టర్ తయారీ సంస్థలు ఇప్పటి వరకు లేవు.
లక్ష కోట్ల డాలర్ల విలువైన మార్కెట్లో పట్టు సాధించే దిశగా టాటా సన్స్ అడుగు ముందుకేసింది. అయితే, సెమీ కండక్టర్ల రంగంలోకి ఎలా ఎంటరవుతారన్న వివరాలను మాత్రం చంద్రశేఖరన్ వెల్లడించలేదు.
తాజాగా స్మార్ట్ ఫోన్లు మొదలు లాప్టాప్లు.. కార్ల వరకు ప్రతిదీ టెక్నాలజీతో లింక్ పెట్టుకున్నాయి. కానీ.. కోవిడ్-19తో తలెత్తిన సంక్షోభం..స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. లాప్ట్యాప్ కంప్యూటర్లకు పెరిగిన డిమాండ్.. పర్సనల్ మొబిలిటీకి ప్రియారిటీ.. క్రిప్టో కరెన్సీల తయారీ.. అన్నింటికి మించి డ్రాగన్పైనే ఆధారపడటం వంటి అంశాలు ప్రస్తుతం టెక్నాలజీ రంగానికి కీలకమైన సెమీ కండక్టర్ల కొరత వెంటాడుతున్నది.
కరోనాతో లాక్డౌన్ల వల్ల ఫ్యాక్టరీల మూసివేత కూడా కూడా సెమీ కండక్టర్ల కొరతకు కారణం. టెక్నాలజీతో సహా అన్ని రంగాల పరిశ్రమలకు అవసరమైన విడి భాగాల కోసం ప్రపంచ దేశాలన్నీ చైనాపైనే ఆధారపడ్డాయి. కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న వుహాన్.. చైనాలో అంతర్భాగమే.
కరోనా మహమ్మారి విజ్రుంభించిన తర్వాత చైనాకు ప్రపంచ దేశాలకు భౌగోళిక రాజకీయ విభేదాలు ఎక్కువయ్యాయి. మారిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ స్థాపించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించకముందు దాని అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవోగా వ్యవహరించారు.