Aditya Puri | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీగా పని చేసిన ఆదిత్య పూరీ.. త్వరలో మరో ప్రైవేట్ బ్యాంక్ `యెస్`బ్యాంక్ డైరెక్టర్గా నియమితులు కానున్నారని సమాచారం. కార్ల్యేల్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్గా ఆదిత్య పూరీ పని చేస్తున్నారు. ఇటీవల `యెస్` బ్యాంక్లో కార్ల్యేల్ గ్రూప్ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కనుక `యెస్` బ్యాంక్లో తమ డైరెక్టర్గా ఆదిత్య పూరీని కార్ల్యేల్ గ్రూప్ నియమించనున్నదని తెలుస్తున్నది.
కార్ల్యేల్ గ్రూప్తోపాటు యెస్ బ్యాంక్లో వాటాలు కొనుగోలు చేసిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ తరఫున ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ శ్వేతా జలాన్ నియమితులు కానున్నారు. త్వరలో యెస్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఆదిత్య పూరీ, శ్వేత జాలాన్ నియామకాలను నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీకి సిఫారసు చేస్తారని సమాచారం. ఆదిత్య పూరీ, శ్వేత జాలన్లను డైరెక్టర్లుగా ఆమోదించి.. ఆర్బీఐ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. కార్ల్యేల్ గ్రూప్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ తరఫున నామినీ డైరెక్టర్లుగా.. యెస్ బ్యాంక్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ రిటైరింగ్ సభ్యులుగా కొనసాగుతారు.
ఆదిత్యపూరీ నియామకంపై కార్ల్యేల్ గ్రూప్, యెస్ బ్యాంక్ స్పందించలేదు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ `నో కామెంట్స్` అని వ్యాఖ్యానించింది. కార్ల్యేల్ గ్రూప్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థలు 1.11 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.8,900 కోట్లు) యెస్ బ్యాంక్లో పెట్టుబడులు పెట్టారు. ఈ రెండింటి వాటాల విక్రయ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా యెస్ బ్యాంక్ ఎండీ కం సీఈవోగా ప్రశాంత్ కుమార్ కొనసాగుతారు.