ముంబై, మే 27: నిత్యావసరాల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంటున్నది. సరఫరా-డిమాండ్ మధ్య అంతరాలు.. ఆహారోత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తున్నాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్నది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, వంటనూనెల ధరలు భగ్గుమంటుండగా, ఇంకొన్ని రోజులు భరించక తప్పకపోవచ్చని ఇందులో ఆర్బీఐ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ క్రమంలోనే టోకు ధరల సూచీ, రిటైల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణాలు.. ఆహార ద్రవ్యోల్బణం కదలికలను ప్రతిబింబిస్తున్నాయన్నది. బహిరంగ మార్కెట్లో రకాలనుబట్టి కిలో పప్పు ధర రూ.100-130 పలుకుతుండగా, లీటర్ వంటనూనె ధర 180-200లుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి అధిక దిగుబడుల నేపథ్యంలో తృణధాన్యాల ధరలు దిగిరావచ్చని అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరికొంత కాలం ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పకనే చెప్పింది.
వినిమయం పెరగాలి
కరోనా సెకండ్ వేవ్ అనంతరం పెరిగే వినిమయం, పెట్టుబడులే.. దేశ జీడీపీ ప్రగతిని నిర్దేశిస్తాయని ఆర్బీఐ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు మహమ్మారికి బలైపోయిందన్న ఆర్బీఐ.. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కరోనా విజృంభించడం దురదృష్టకరమన్నది. అయితే వ్యాక్సినేషన్తో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ దేశ వృద్ధిరేటుకు కరోనానే పెద్ద సవాల్గా అభివర్ణించిన ఆర్బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను తమ జీడీపీ అంచనాలను సవరించుకునే పరిస్థితి వచ్చేలా ఉందని హెచ్చరించింది
కనుమరుగవుతున్న రూ.2వేల నోట్లు
పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి ఆర్బీఐ కొత్తగా రూ.2వేల నోట్లను తెచ్చింది. 2017-18లో ఇవి 33,630 లక్షల నోట్లుండగా, వీటి విలువ రూ.6.72 లక్షల కోట్లు. అయితే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 24,510 లక్షలకు పడిపోగా, వీటి విలువ రూ.4.90 లక్షల కోట్లకు తగ్గిపోయింది. దీంతో గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో 9,120 లక్షల నోట్లు (27%) కనుమరుగయ్యాయి. వీటి విలువ రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు బ్యాంకుల నుంచిగానీ, ఏటీఎంల ద్వారాగానీ చలామణిలోకి రూ.2వేల నోట్లు రావడం లేదు. ఇక ఇప్పటికే రూ.2వేల నోట్ల ముద్రణను ఆపేసినట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తగ్గుతున్న రూ.2వేల నోట్ల గురించి తాజా నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించకపోయినా.. చలామణిలో ఉన్న పెద్ద నోట్లను మాత్రం క్రమంగా వెనక్కి తీసుకుంటున్నారని స్పష్టమవుతున్నది. కాగా, ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో రూ.500, రూ.2,000 నోట్లు కలిసి 85.7 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో అత్యధికంగా రూ.500 నోట్లు 31.1 శాతం, ఆ తర్వాత రూ.10 నోట్లు 23.6 శాతం ఉన్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.500 నోట్ల చలామణి పెరుగుతూ వస్తున్నది.
వార్షిక నివేదికలో ఆర్బీఐ ఏమన్నది?