Adani to Drones | డ్రోన్ టెక్ కంపెనీ జనరల్ ఏరోనాటిక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ 50 శాతం వాటా కొనుగోలు చేయనున్నది. ఇందు కోసం జనరల్ ఏరోనాటిక్స్తో గురువారం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్చేంజ్లకు అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ సమాచారం ఇచ్చింది. ఈ ఒప్పందం వచ్చే జూలై నెలాఖరు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఈ ఒప్పందం పూర్తయితే జనరల్ ఏరోనాటిక్స్తో కలిసి దేశీయ వ్యవసాయ రంగంలో సేవలందించనుంది. ఇంకా ఏఐ/ ఎంఎల్ సామర్థ్యంతో మిలిటరీ డ్రోన్స్లో సేవలందించడానికి సిద్ధం అవుతున్నది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న జనరల్ ఏరోనాటిక్స్ .. వ్యవసాయ రంగంలో పరిష్కార మార్గాలు చూపుతున్నది. భారత్ డ్రోన్ మహోత్సవ్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన రోజే జనరల్ ఏరోనాటిక్స్లో అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ వాటా కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.