ఇద్దరు మిత్రుల కథ గుర్తుందిగా?! ఆప్త మిత్రుడి కోసం కొండమీద కోతిని కూడా క్షణాల్లో తీసుకొచ్చే ఆ నేస్తం.. పక్కనున్న బంగ్లాదేశ్కు వెళ్లిమరీ ఓ పవర్ డీల్ను కుదుర్చుకొచ్చారు. దౌత్య సంబంధాలు తాకట్టు పెట్టిమరీ.. ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేసేలా డీల్ చక్కబెట్టారంటూ వాషింగ్టన్ పోస్ట్, ఫోర్బ్స్, అల్ జజీరా వంటి ప్రధాన పత్రికలు తూర్పారబట్టాయి. ఇప్పుడు ఏకంగా.. బంగ్లాదేశ్లోనే అతిపెద్ద వార్తాపత్రిక ‘ది డైలీ స్టార్’ ఈ డీల్పై నిప్పులు చెరిగింది. ‘అదానీ-బంగ్లా విద్యుత్తు డీల్’ ఓ పెద్ద కుట్ర అని, బంగ్లాదేశ్ ప్రయోజనాలకు నష్టదాయకమని ఏకిపారేసింది. పనిలో పనిగా.. మోదీ-అదానీ బంధాన్ని కూడా విమర్శించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): 2015లో అదానీ పవర్ ప్లాంట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుదుర్చుకొన్న విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని బంగ్లా ప్రధాన పత్రిక ‘ది డైలీ స్టార్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశీయ అవసరాలకు మించి ఎక్కువ విద్యుదుత్పత్తి ఉన్నప్పటికీ, బయటి దేశంలోని (భారత్) ఓ ప్రైవేట్ కంపెనీతో ఎక్కువ ధరకు డీల్ను కుదుర్చుకోవడమేంటని ప్రశ్నించింది. ఈ ఒప్పందం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నదని తూర్పారబట్టింది. డీల్ పూర్తవడానికి రెండు నెలల ముందు ప్రధాని మోదీ బంగ్లాలో పర్యటించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి ఎప్పట్నుంచో అనుబంధం ఉన్నదని వెల్లడించింది. అదానీ పవర్కు లబ్ధి చేకూర్చేలా ఉన్న ఈ డీల్ ఓ పెద్ద కుట్ర అని అభివర్ణిస్తూ.. ఈ ఒప్పందంపై సమీక్ష జరుపాలంటూ ఆయా రంగ నిపుణులను కోరింది. వాళ్లు కూడా ఈ డీల్ అక్రమమేనని తేల్చడం గమనార్హం. కాగా, ఈ ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు (బీపీడీబీ) అప్పటి సెక్రటరీ మీనా బసూద్ ఉజ్జామన్ను ది డైలీ స్టార్ సంప్రదించింది. ఈ డీల్కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. డీల్ గురించి తనకేమీ గుర్తులేదని, చైర్మన్ ద్వారానే ఆదేశాలు వచ్చాయని, తాను సంతకం చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. డీల్పై అప్పటి బీపీడీబీ చైర్మన్ ఖలీద్ మహమూద్ను ది డైలీ స్టార్ సంప్రదించగా.. ఈ డీల్ గురించి మాట్లాడే ఆసక్తి తనకు లేదని పేర్కొనడం గమనార్హం.
2015 జూన్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. దౌత్య, వాణిజ్య సంబంధాల బలోపేతంలో భాగంగా ఆ దేశంతో 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బంగ్లాలో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని షేక్ హసీనాకు హామీనిచ్చారు. అయితే జార్ఖండ్లోని గొడ్డాలో నిర్మించనున్న అదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని, అదానీకి చెందిన విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతినివ్వాలని మెలిక పెట్టారు. దీంతో డిమాండ్ కంటే 40 శాతం అదనంగా విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ హసీనా 25 ఏండ్ల పాటు కొనసాగే ఈ డీల్కు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొన్నారు. అయితే హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఇదే సమయంలో.. అదానీ పవర్తో కుదుర్చుకొన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ఆర్థికంగా తమకు నష్టదాయకంగా ఉన్నదని, ఆ డీల్లో సవరణలు చేయాలని పట్టుబడుతూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు (బీపీడీబీ) సూచనలు చేసింది. దీనిపై అదానీ గ్రూప్ స్పందించలేదు. అయితే ఈ ఒప్పందం కుదుర్చడంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ భాగమయ్యారన్న వార్తల నేపథ్యంలో.. కేంద్రం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఆ ఒప్పందం ఓ సార్వభౌమ ప్రభుత్వం (బంగ్లాదేశ్ సర్కారు), ఓ భారతీయ కంపెనీ మధ్య జరిగిందని, దీంట్లో తమ ప్రభుత్వాన్ని లాగొద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ మీడియాకు తెలిపారు. ఇప్పటికే శ్రీలంకలోని మన్నార్లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ (పవన విద్యుత్తు) ప్లాంటు కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినట్టు గత జూన్లో వెల్లడైంది. శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) అప్పటి చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండోయే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించటం సంచలనం సృష్టించింది. అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా లంకలో పెద్దయెత్తున ఉద్యమాలూ జరిగిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా అదానీ పవర్ ఒప్పందం ఉన్నది. ఇలాంటి డీల్పై ఏ ఒక్కరూ సంతకం పెట్టడానికి సమ్మతించరు.
-టిమ్ బక్లే, ైక్లెమెట్ ఎనర్జీ ఫైనాన్స్ ఆస్ట్రేలియా వ్యవస్థాపకుడు