Adani Ports-Deloitte | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థకు ఎదురు దెబ్బ తగలనున్నది. ఆర్థిక లావాదేవీల రికార్డింగ్లో తేడాలు రావడంతో సంస్థ అడిటర్గా కొనసాగుతున్న డెల్లాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ రాజీనామా చేయనున్నట్లు తెలిపింది. కొన్నేండ్లుగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్గా డెల్లాయిట్ కొనసాగుతున్నది. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని, మోసాలకు పాల్పడుతున్నదని గత జనవరిలో యూఎస్ షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్గా డెల్లాయిట్ వైదొలగనున్నదన్న వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఏడాది క్రితమే తిరిగి అడిటర్గా నియమించినా.. కొన్ని ట్రాన్సాక్షన్స్ విషయంలో కంపెనీ యాజమాన్యంతో డెల్లాయిట్కు విభేదాలు తలెత్తినట్లు సమాచారం. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఆడిటింగ్ సంస్థగా రాజీనామా చేస్తున్నట్లు డెల్లాయిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చునని తెలుస్తున్నది. 2017-18 నుంచి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్ గా డెల్లాయిట్ కొనసాగుతున్నదని 2021-22 కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. తిరిగి వచ్చే ఐదేండ్ల కాలానికి డెల్లాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తన అడిటర్గా గతేడాది నియమించుకున్నట్లు 2021-22 వార్షిక నివేదికలో తెలిపింది.
ఈ వార్తల నేపథ్యంలో డెల్లాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ స్థానే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ తన అడిటర్గా ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్ను నియమించుకున్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లు స్వల్పంగా పతనమై రూ.799.65 వద్ద ముగిసింది.
అయితే అదానీ పోర్ట్స్, మరో మూడు సంస్థల మధ్య లావాదేవీలపై డెల్లాయిట్ హాస్కిన్స్ ఇండియా యూనిట్ గత మే నెలలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక చట్టాలకు లోబడి అదానీ కంపెనీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయన్న సంగతి ధ్రువీకరించుకోలేదని డెల్లాయిట్ హాస్కిన్స్ పేర్కొన్నది. అడిటింగ్ ఫ్రాడ్, స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడుతున్నదంటూ అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికా కేంద్రంగా పని చేస్తున్న షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలపై విస్త్రుత దర్యాప్తు జరిపిన డెల్లాయిట్.. గత ఏప్రిల్లోనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని అదానీ గ్రూప్ పదేపదే వాదిస్తూ వస్తున్నది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో అవకతవకలపై నియంత్రణ సంస్థగా ‘సెబీ’ విఫలమైందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నియామక కమిటీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.