న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశీయ కుబేరుల జాబితాలో అగ్రగామిగా వెలుగొందుతున్న ముకేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. గత కొన్నేండ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న తన ర్యాంక్ రెండో స్థానానికి పడిపోయింది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఈ ర్యాంక్ను దక్కించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘రియల్-టైమ్ బిలియనీర్ల’ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. గౌతమ్ అదానీ సంపద 637 మిలియన్ డాలర్లు పెరిగి 91.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన టాప్-10లోకి వచ్చారు. మరోవైపు 794 మిలియన్ డాలర్లు పెరిగి 89.2 బిలియన్ డాలర్లతో ముకేశ్ అంబానీ ర్యాంక్ 11కి పడిపోయింది. సంపన్న వర్గాలకు చెందిన షేర్లు లాభ-నష్టాలతో వారి ర్యాంక్లు కూడా రోజువారిగా మారనున్నాయి.
జుకర్బర్గ్ను దాటేసిన ముకేశ్, గౌతమ్
మెటా షేరు ఇచ్చిన షాక్తో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ సంపద లక్ష కోట్లు ఆవిరైపోయింది. గురువారం ఆయన సంపద 29 బిలియన్ డాలర్లు(రూ.2 లక్షల కోట్లకు పైమాటే) సంపదను కోల్పోవడంతో సంపన్నవర్గాల జాబితాలో ర్యాంక్ భారీగా పడిపోయింది. దేశీయ కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల కిందకు పడిపోవడం గమనార్హం. ప్రస్తుతం మార్క్ జుకర్బర్గ్ కంటే ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు అధిక సంపద కలిగివున్నారని రిచర్స్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం జుకర్బర్గ్ నికర సంపద 85 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గతేడాది నవంబర్లో ఎలాన్ మస్క్ ఒకేరోజు 35 బిలియన్ డాలర్లు(రూ.2.62 లక్షల కోట్లు) సంపద కోల్పోయిన తర్వాత ఇదే రెండో అతి పెద్దది.
బెజోస్ సంపద జూమ్
ఒకవైపు జుకర్బర్గ్ వరుసగా లక్షల కోట్ల సంపదను కోల్పోగా..మరోవైపు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద మాత్రం లక్షల కోట్ల స్థాయిలో పెరిగింది. అమెజాన్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో జెఫ్ బెజోస్ సంపద 20 బిలియన్ డాలర్లు(రూ.1.50 లక్షల కోట్లు) పెరిగింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో బెజోస్కు 9.9 శాతం వాటా ఉన్నది.