న్యూఢిల్లీ, మే 27: వరుస టేకోవర్లు జరుపుతున్న అదానీ గ్రూప్ మరో కీలకమైన డ్రోన్ టెక్నాలజీ కంపెనీని చేజిక్కించుకుంటున్నది. జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 50 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ శుక్రవారం ప్రకటించింది. డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), అనలిటిక్స్ను ఉపయోగించి, వ్యవసాయ రంగంలో పంట సంరక్షణ, సాగుబడి, దిగుబడి పర్యవేక్షణ తదితరాలకు రొబొటిక్ డ్రోన్లను, డ్రోన్ ఆధారిత సొల్యూషన్లను జనరల్ ఏరోనాటిక్స్ అందిస్తున్నది. తమ సబ్సిడరీ అదాని డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్కు ఉన్న మిలటరీ డ్రోన్, ఏఐ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ జనరల్ ఏరోనాటిక్స్తో కలిసి దేశీ వ్యవసాయ రంగానికి సొల్యూషన్స్ అందిస్తుందని అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. 2022 జూలై 31కల్లా టేకోవర్ పూర్తవుతుందన్నది.