ముంబై : హిండెన్బర్గ్ రీసెర్చి నివేదికతో బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ శుక్రవారం ఏకంగా 30 శాతం నష్టపోయింది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ 115 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. అదానీ గ్రూపు కంపెనీల్లో ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ హిండెన్బర్గ్ నివేదికకు ముందు 217 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 102 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
షేర్ విలువను పెంచేందుకు అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని, మనీ ల్యాండరింగ్ కార్యకలాపాలకు తెగబడిందని హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించినప్పటి నుంచి అదానీ గ్రూపు కంపెనీల షేర్లు నేలచూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూపునకు పెరుగుతున్న రుణ భారంపైనా ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక శుక్రవారం ట్రేడింగ్లో ఏప్రిల్ 2021 నుంచి కనిష్టస్ధాయిలో అదానీ ఎంటర్ప్రైజెస్ 30 శాతం పతనమైంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడినప్పటి నుంచి ఈ షేర్ 68 శాతం నష్టపోయింది.
ఇక అదానీ పోర్ట్స్ ఎస్ఈజడ్ లిమిటెడ్ 6 శాతం నష్టపోగా, అదానీ ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ కంపెనీలు పది శాతం చొప్పున పతనమయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం నష్టపోయింది. మరోవైపు అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోవడంతో ఈ గ్రూపునకు రుణాలిచ్చిన బ్యాంకులను పూర్తి వివరాలు అందచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరింది. ఇక అదానీ గ్రూపు కంపెనీల షేర్ల దరల కదలికలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా పరిశీలిస్తోంది.