న్యూఢిల్లీ : హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపధ్యంలో గత కొద్దిరోజులగా అదానీ గ్రూపు షేర్ల పతనంతో భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూపు షేర్ల పతనం ఇలాగే కొనసాగితే ఆసియా రిచ్ లిస్ట్లోనూ అదానీ స్ధానం దిగజారనుంది. మూడు ట్రేడింగ్ రోజుల్లోనే అదానీ వ్యక్తిగత సంపద 34 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో అదానీ 4వ స్ధానం నుంచి ఏకంగా 11వ స్ధానానికి పడిపోయారు.
అదానీ ప్రస్తుతం ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ కంటే కేవలం ఒక ర్యాంకు ఎగువన ఉన్నారు. బిలియనీర్స్ సూచీలో అదానీ ప్రస్తుతం మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్, గూగుల్ సహ వ్యవస్ధాపకుడు సెర్జీ బ్రిన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బామర్ కంటే వెనకబడ్డారు.
అకౌంటింగ్ తప్పిదాలతో పాటు షేర్ల విలువ పెంపుదలకు తప్పుడు మార్గాలు అవలంభించారని పలు ఆరోపణలు గుప్పిస్తూ హిండెన్బర్గ్ రీసెర్చి నివేదిక వెలువడటంతో అదానీ కంపెనీల షేర్లు గత కొద్దిసెషన్స్లో కుప్పకూలాయి. ఇక ఈ అమ్మకాల హోరుతో స్టాక్ మార్కెట్ సైతం కుదేలైంది. మూడు వరుస సెషన్స్లో దేశీయ స్టాక్ మార్కెట్ రూ.11.8 లక్షల కోట్లు నష్టపోయింది. ఇందులో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల వాటానే రూ.5.56 లక్షల కోట్లు ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనా.