Banks Fraud | దేశంలోకెల్లా అతిపెద్దబ్యాంక్ ఫ్రాడ్.. ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.22,842 కోట్ల మేర శఠగోపం పెట్టిన కంపెనీ సంగతి బయటపడింది. ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్, దాని మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేశ్ అగర్వాల్ తదితరులు ఈ మోసం చేశారని అధికారులు తెలిపారు. రిషి కమలేశ్ అగర్వాల్తోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నివేతియా, ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ మోసంలో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తున్నదని సీబీఐ అధికారులు తెలిపారు.
నేరపూరిత కుట్రతోపాటు మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదైంది. ప్రైవేట్ కంపెనీ ఆఫీసుతోపాటు సూరత్, బారుచ్, ముంబై, పుణెలతోపాటు మొత్తం 13 కేంద్రాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది.
2019 నవంబర్ 8న బ్యాంకులు తొలుత ఫిర్యాదు చేశాయి. 2020 మార్చి 12న ఈ పిర్యాదులపై కొన్ని వివరణలు కోరాయి. ఎస్బీఐ గతేడాది మరో ఫిర్యాదు చేసింది. 18 నెలల సుదీర్ఘ తనిఖీలు, పరిశీలనల తర్వాత ఈ నెల ఏడో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ నిర్ణయించింది. రిషి కమలేశ్ అగర్వాల్ సారధ్యంలోని కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ సారధ్యంలోని 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కన్సార్టియం రుణ పరపతి కల్పించింది. ఎస్బీఐకి రూ.2,468.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది.
2012-17 మధ్య ఎర్న్ట్స్ అండ్ ఎంగెస్ట్ నిర్వహించిన ఫోరెన్సిక్ అడిట్లో ఈ కంపెనీ, దాని డైరెక్టర్లు కుమ్మక్కై నిధులు దారి మళ్లించారని తేలింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఈ అడిట్ నిగ్గు తేల్చింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల మోసం కేసును సీబీఐ నమోదు చేసింది. బ్యాంకులు విడుదల చేసిన రుణాలను పేర్కొన్న అవసరాలకు కాకుండా మిగతా ప్రయోజనాలకు ఖర్చు చేశారని సీబీఐ అభియోగం మోపింది. 2016 జూలైలో ఈ ఖాతాను మొండి బాకీగా, 2019లో మోసంగా ప్రకటించారు.
ఓడల తయారీ.. పాత ఓడల రిపేర్ల పేరిట ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ (ఏబీజీఎస్ఎల్) ఏర్పాటైంది. దీనికి ఏబీజీ గ్రూప్ సారధ్య సంస్థ. గుజరాత్లోని దాహెజ్, సూరత్లలో షిప్యార్డులను ఏబీజీఎస్ఎల్ నిర్వహిస్తున్నది. గత 16 ఏండ్లలో న్యూస్ప్రింట్ రవాణా చేసే ఓడలతోపాటు మొత్తం 165 ఓడలు తయారు చేశాయి. అంతర్జాతీయ సంక్షోభం తలెత్తిన తర్వాత డిమాండ్ పడిపోయింది. డిమాండ్ లేక ఓడల తయారీ కాంట్రాక్టులు రద్దయ్యాయి. ఫలితంగా తయారైన ఓడలు.. వస్తువుల నిల్వలకు దారి తీశాయి. కాంట్రాక్టులు రాక.. డబ్బు లేక రుణ బకాయిల చెల్లింపులకు ఏబీజీఎస్ఎల్ కష్టాల్లో చిక్కుకుందని ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది.