న్యూఢిల్లీ, జనవరి 24: హైదరాబాదీ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీ హోల్డింగ్స్) దివాలా ప్రక్రియ పరిష్కార ప్రణాళికకు అప్పిలేట్ ట్రిబ్యునల్ నో చెప్పింది. ఈ పరిష్కార ప్రణాళికను 2019 జూన్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఆమోదిస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని తాజాగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిలిపివేసింది. వివరాలివి…డీసీ హోల్డింగ్స్ రూ. 8,180 కోట్ల రుణాల్ని చెల్లించాల్సివుందని 37 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్లయిం చేయగా, రూ.350 కోట్ల నగదును శ్రేయీ మల్టీపుల్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కు చెందిన విజన్ ఇండియా ఫండ్ ఆఫర్ చేసింది. ఇందుకు రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదం తెలపగా, ఎన్సీఎల్టీ సైతం అప్పుడు ఆమోదముద్ర వేసింది. ప్రొరాటా ప్రాతిపదికన తమకు రూ. 13.48 కోట్లే ఆఫర్ చేయడంతో ఐడీబీఐ బ్యాంక్..ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దీంతో తాజాగా ట్రిబ్యునల్..ఎన్సీఎల్టీ బెంచ్ ఉత్తర్వుల్ని రద్దుచేస్తూ, చట్ట ప్రకారం నిధుల పంపిణీ జరుపుతూ ప్రణాళికను సమర్పించాలని రుణదాతల కమిటీని ఆదేశించింది.