Tata Super App | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్, డిజిటల్ వ్యాపారాన్ని ఢీ కొట్టేందుకు టాటా సన్స్ సిద్ధమైంది. రిలయన్స్కు సవాల్ విసిరేందుకు టాటా సన్స్ గురువారం సూపర్ యాప్ టాటా నియు సేవలను ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా సంస్థ ఉద్యోగుల మధ్య పరీక్షించిన టాటా సన్స్.. ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది.
సూపర్ యాప్ ద్వారా వివిధ వస్తువులు కొనుగోలు చేసే కస్టమర్లు నియు కాయిన్స్, కార్డ్స్, యూపీఐ, ఈఎంఐ ద్వారా చెల్లింపులు జరుపాల్సి ఉంటుంది. నియు కాయిన్స్ ద్వారా పేమెంట్స్పై కొనుగోలుదారులకు రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఆయా ఉత్పత్తులు, సేవలను బట్టి రివార్డు పాయింట్లు ఉంటాయి.
ఉదాహరణకు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా వచ్చే రివార్డు పాయింట్లను తాజ్ హోటల్స్లో బస చేయడానికి, 1ఎంజీలో ఔషధాలు, బిగ్ బాస్కెట్లో నిత్యావసర వస్తువుల కొనుగోలులో రీడీమ్ చేసుకోవచ్చు.
టాటా సన్స్ వారి నియు సూపర్ యాప్ డిజైనింగ్కు సుదీర్ఘ సమయమే తీసుకుంది. 2020లో సూపర్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 25 బిలియన్ల డాలర్ల పెట్టుబడికోసంవాల్మార్ట్తో టాటా గ్రూప్ సంప్రదింపులు జరిపిందని 2020లో వార్తలొచ్చాయి. అయితే రిలయన్స్ జియోకు 40 కోట్ల కస్టమర్లు ఉండటం ముకేశ్ అంబానీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇప్పటికే అతిపెద్ద రిటైల్ చైన్ నెట్వర్క్ కూడా రిలయన్స్కు ఉంది.
ఒకవేళ రిలయన్స్ రిటైల్-డిజిటల్ నెట్వర్క్ను భారత్ టెన్సెంట్గా మారాలని ముకేశ్ అంబానీ భావిస్తుండొచ్చు. అదే జరిగితే రతన్ టాటా- చంద్రశేఖరన్ లక్ష్యం ఇండియా ఆలీబాబాను ఆవిష్కరించినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.
టెట్లీ టీ, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ల బ్రాండ్లతోపాటు 100కి పైగా బిజినెస్లు టాటా సన్స్ సొంతం. ఆయా బిజినెస్లకు దేశవ్యాప్త సప్లయ్ నెట్వర్క్ కూడా ఉంది. ఒకవేళ టాటా సన్స్ దేశవ్యాప్తంగా తన ఉత్పత్తుల విక్రయించడానికి వ్యాపారులు, డీలర్లకు ఒక పోర్టల్ అందుబాటులోకి తేవడంతోపాటు డిస్కౌంట్లు ఇస్తే దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు అనలిస్టులు.