Bharat Pe Dispute | భారత్ పే.. ఇదొక ఫిన్టెక్ పేమెంట్స్ సంస్థ. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడిన సంస్థ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ను భారత్ పే బోర్డు బయటకు సాగనంపింది. తాజాగా సంస్థలో భారత్ పే ఒర్జినల్ ఫౌండర్ భావిక్ కొలాడియాకు, సంస్థ మేనేజ్మెంట్కు మధ్య కొత్త వివాదం తలెత్తే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్పే ప్రారంభ రోజుల్లో కొలాడియా ఒక కన్సల్టెంట్గా ఉన్నారు. అయితే అమెరికాలో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కేసులో దోషిగా తేలడంతో భారత్పేను అశ్నీర్ గ్రోవర్, శశ్వాత్ నక్రాణి మధ్య విభజించారని సమాచారం. అశ్నీర్ గ్రోవర్, కొలాడియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో అశ్నీర్ గ్రోవర్కు కొలాడియా వాటా ట్రాన్స్ఫర్ సంక్లిష్ట పరిస్థితుల్లో సాగిందని వారి ఇద్దరి సన్నిహిత వర్గాల కథనం. తాజాగా అశ్నీర్ గ్రోవర్ ఫోన్ ఆడియో టేప్ లీక్ కావడంతో అతడితో తన సంబంధాలపై కొలాడియా.. న్యాయవాదులతో సంప్రదిస్తున్నారని సమాచారం.
అన్ని ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో అశ్నీర్ గ్రోవర్ ముందు వరుసలో నిలిచేవాడు. 2021లో 280 కోట్ల డాలర్ల నిధులు సేకరించింది భారత్ పే. గతేడాది భారత్పే ఎండీగా నిధుల సేకరణ ప్రయత్నాలను గ్రోవర్ కొనసాగించారు. అయితే, కొలాడియా వాటా ఎంత అన్నది పూర్తిగా తెలియరాలేదు.
ప్రస్తుతం అశ్నీర్ గ్రోవర్కు 8.5-9.5 శాతం, కొలాడియాకు నాలుగు శాతం వాటా ఉండొచ్చునని అంచనా. కొలాడియా, నక్రాణి మధ్య ఇటువంటి ఒప్పందమే ఉండొచ్చునని సమాచారం. ఈ నెల ఒకటో తేదీ నుంచి సంస్థ నుంచి అనూహ్య రీతిలో ఉద్వాసనకు గురైనా భారత్ పేలో తన వాటా వదులుకోవడం అంత తేలిక్కాదని గ్రోవర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, భారత్ పేలో కొలాడియాకు మేనేజ్మెంట్తో సంబంధాలు లేవు. దీనిపై స్పందించడానికి అశ్నీర్ గ్రోవర్, కొలాడియా, భారత్ పే నిరాకరించాయి.