Made in TS | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఇక్కడ తయారవుతున్న వైద్య పరికరాల పనితీరును పరీక్షించేందుకు ఉద్దేశించిన ప్రొడక్ట్ టెస్టింగ్కు సంబంధించి ఆరు ప్రముఖ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచస్థాయి వైద్య పరికరాల తయారీకి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా మారిన నేపథ్యంలో పరికరాల నాణ్యతలో ఈ ఒప్పందం గొప్ప మార్పుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తాజాగా మరో మూడు కంపెనీలు తమ ప్రపంచస్థాయి ఉత్పత్తులను మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించాయి. ప్రపంచ వైద్య పరికరాల రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ దూసుకుపోతుండటం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇక ఆయా కంపెనీల విషయానికొస్తే..
హ్యూవెల్ లైఫ్ సైన్సెస్
ఈ కంపెనీ మెడికల్ డివైజెస్ పార్క్లో ఇన్విట్రో డయాగ్నస్టిక్స్, రియాజెంట్లలో రెండు పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ (పీవోసీటీ) పరికరాలను అభివృద్ధి చేసింది. వివిధ రకాల అంటువ్యాధులను ఈ పరికరాల ద్వారా సులభంగా గుర్తించే వీలుంటుంది. కంపెనీకి వివిధ రకాల డయాగ్నస్టిక్ కిట్ల తయారీకి సంబంధించి 20 రకాల లైసెన్సులు ఉన్నాయి.
ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్
ఈ కంపెనీని జీనోమ్ వ్యాలీలో రూ.25 కోట్ల పెట్టుబడితో నెలకొల్పారు. నెలకు రెండు మిలియన్ల క్షయవ్యాధి నిర్ధారణ కిట్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో తెచ్చారు. టీబీతోపాటు దాని యాంటీబయాటిక్ నిరోధకతను గుర్తించేందుకు కచ్చితమైన, సులభమైన, వేగవంతమైన, చవకైన డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్లను అభివృద్ధి చేసింది.
బ్లూ సెమీ
టీ-హబ్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ఈవైవీఏ పరికరాన్ని ఆవిష్కరించింది. ఈ పరికరం స్పర్శ ద్వారా 60 సెకన్లలోనే నాన్-ఇన్వాసిస్ బ్లడ్ గ్లూకోజ్సహా రోగి రక్తంలోని ఆరు కీలక అంశాలను గుర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, హృదయ స్పందన రేటు, ఈసీజీ, ఆక్సిజన్ స్థాయి, హెచ్బీఏ1సీ తదితరవాటిని కొలిచేందుకు రూపొందించారు.
అత్యాధునిక పరికరాల తయారీలో..
హైదరాబాద్లోని అనేక కంపెనీలు, స్టార్టప్లు 3డీ-ప్రింటెడ్ బయోనిక్ ఆర్మ్స్, ఇమేజింగ్ సిస్టమ్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్, మొబైల్ డయాలసిస్ యూనిట్లు, ఇంప్లాంట్స్ వంటి అడ్వాన్డ్స్ వైద్య పరికరాలను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్సీసీ లేబొరేటరీస్, టీ-వర్క్స్, పాలమూర్ బయోసైన్సెస్, విమ్టా ల్యాబ్స్, ఈసీఐఎల్, వివో బయోటెక్ వంటి కంపెనీలు రకరకాల సేవలు అందిస్తున్నాయి.
కీలక మైలురాయి: కేటీఆర్
మెడ్టెక్ సెక్టార్లో ఉత్పత్తి పరీక్షలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం.. అలాగే, ప్రపంచస్థాయి ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తులను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిద్వారా తెలంగాణ మెడ్టెక్ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. హ్యూవెల్ లైఫ్సైన్సెస్, ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్, బ్లూ సెమీ కంపెనీల ఉత్పత్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవని, ఇవి తెలంగాణలో తయారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
తెలంగాణ ఇప్పటికే దేశీయ ఔషధ ఉత్పత్తిలో 40 శాతం, ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉన్నది. లైఫ్సైన్సెస్ రంగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నది. ఇప్పుడు వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ తనకు సాటిలేదని నిరూపించుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ప్రపంచస్థాయి నాణ్యతతో వైద్య పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2017లో ప్రారంభమైన ఈ పార్క్.. రూ.1,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలతో దేశంలో అతిపెద్ద మెడికల్ డివైజెస్ క్లస్టర్గా అవతరించింది. కంపెనీలకు అవసరమైన ఉత్పత్తి పరీక్ష (టెస్టింగ్స్)ల సేవలతోపాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్టు వినూత్న ఉత్పత్తుల అభివృద్ధికి ఎండ్-టు-ఎండ్ ఎకోసిస్టం ఏర్పాటు ద్వారా మేక్ ఇన్ ఇండియాను ఇన్నోవేట్ ఇన్ ఇండియాగా విస్తరించడానికి ఈ పార్క్ సిద్ధమైంది.
మంగళవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ఐఎస్వో సర్టిఫైడ్ సౌకర్యాలున్న ఆరు ప్రముఖ సంస్థలతో ఉత్పత్తి పరీక్షలు, ప్రొటోటైపింగ్ సేవలకు సంబంధించి అవగాహన ఒప్పందం చేసుకున్నది. ఈ ఏడాది నిర్వహించిన బయో ఏషియా సదస్సులో మెడ్టెక్ సీఈవోల రౌండ్టేబుల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ ఒప్పందం జరిగింది. సిరంజీల నుంచి ఇంప్లాంట్లు, ఎంఆర్ఐ స్కానర్ల వరకు వైద్య పరికరాలు ఎంతో సంక్లిష్టమైన సాంకేతికను కలిగి ఉంటాయి. వినియోగంలో ఇవి కచ్చితమైన ఫలితాలను సూచించడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పరీక్షల సేవలు అందుబాటులోకి రావడం కీలక ముందడుగుగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఒప్పందం అనంతరం మంత్రి కేటీఆర్ మెడికల్ డివైజెస్ పార్క్లో తయారైన హ్యూవెల్ లైఫ్సైన్సెస్, ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్, బ్లూ సెమీ కంపెనీల ఉత్పత్తులను ఆవిష్కరించారు.