HDFC | న్యూఢిల్లీ, జూన్ 27: ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోకి దాని మాతృసంస్థ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ జూలై 1 నుంచి విలీనం కానున్నది. విలీన తేదీని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ మంగళవారం ప్రకటించారు. విలీన ప్రతిపాదనను ఆమోదించేందుకు జూన్ 30న చివరి హెచ్డీఎఫ్సీ బోర్డు సమావేశం జరుగుతుందని, అదే రోజున బ్యాంక్ బోర్డు సైతం సమావేశమవుతుందని పరేఖ్ వివరించారు. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు జూలై 13న డీలిస్ట్ అవుతాయని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకి మిస్త్రి తెలిపారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఈ అతిపెద్ద విలీన లావాదేవీకి గత ఏడాది ఏప్రిల్ 4న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంగీకారం తెలిపింది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరిగే ఈ లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లు (రూ.3.28 లక్షల కోట్లు) అని అంచనా. హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు ప్రతీ 25 షేర్లకూ 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు లభిస్తాయి.
పూర్తిగా పబ్లిక్ సొంతం
ఇప్పటివరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 20 శాతంపైగా వాటా హెచ్డీఎఫ్సీ చెంత ఉన్నది. విలీనంతో ఇక నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పూర్తిగా పబ్లిక్ షేర్హోల్డర్లకు సొంతమవుతుంది. హష్ముఖ్భాయ్ పరేఖ్ 1977లో నెలకొల్పిన హెచ్డీఎఫ్సీ.. 1990వ దశకంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను ప్రారంభించింది. అటుతర్వాత హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను మించిన వృద్ధిని బ్యాంక్ సాధించింది. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లకు చేరుతుంది. ఆర్ఐఎల్ తర్వాత అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవిస్తుంది. విలీన వార్త నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు 1.5 శాతం లాభపడ్డాయి.