Tesla | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): టెస్లా విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ పరిశ్రమను రాబట్టేందుకు రాష్ర్టాల మధ్య తీవ్ర పోటీ నెలకున్నది. ఈ రేసులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు ఇప్పుడు రాజస్థాన్ కూడా తోడైంది. నిజానికి అమెరికాకు చెందిన టెస్లా సంస్థ.. భారత్లో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు 2-3 ఏండ్లుగా ప్రయత్నిస్తున్నది. దీంతో తెలంగాణకు రప్పించేందుకు అప్పటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎంతో ప్రయత్నించారు.
అమెరికాలో ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా అప్పట్లో వెనుకాడిన టెస్లా.. ఇప్పుడు దేశంలో అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నది. ఆ సంస్థ అధినాయకత్వం భారత్లో పర్యటిస్తున్నది. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఏ ప్రయత్నమూ చేస్తున్న దాఖలాలు కానరావడంలేదు.
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పోటీ ఇస్తున్నప్పటికీ.. టెస్లాకు ఆదరణ తగ్గడం లేదనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం టెస్లా కంపెనీ భారత్ కేంద్రంగా ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. 3 బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు, ఇందులో భాగంగా ముందు 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4150కోట్లు)తో వచ్చే మూడేండ్లలో వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని నిర్ణయించినట్టు కంపెనీ వర్గాలు చెప్తున్నా యి.
ఈ నేపథ్యంలో టెస్లా యాజమాన్యాన్ని ఆకర్షించేందుకు ఆయా రాష్ర్టాలు పోటీపడుతున్నాయి. గత వారం రాజస్థాన్కు చెందిన అధికారుల బృందమొకటి టెస్లా ప్రతినిధులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుకు భివాడీ, సాలార్పూర్, ఖుష్ఖేరా ఇండస్ట్రియల్ జోన్లను సూచించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాంతాలు ప్రస్తుతం ఆటో హబ్గా రూపొందుతున్నట్టు, ఢిల్లీ-జైపూర్ ఎక్స్ప్రెస్వేకి ఆనుకొని ఉంటుందని, ఢిల్లీ-ముంబై మార్గానికీ సమీపంలో ఉంటుందని వారు చెప్పినట్టు చెప్తున్నారు. సరసమైన ధరలకే భూములు కేటాయిస్తామని కూడా టెస్లాకు రాజస్థాన్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందంటున్నారు.
మూడో అతిపెద్ద మార్కెట్గా..
ఆటో రంగంలో 2026 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరించనుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలు, టూవీలర్లు దేశీయంగా జోరుగానే ఉత్పత్తి అవుతున్నాయి. గుజరాత్లో టాటా మోటర్స్, సుజుకీ మోటర్స్, ఎంజీ మోటర్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా ప్లాంట్లున్నాయి. అలాగే హర్యానాలో మారుతీ సుజుకీ, జార్ఖండ్లో టాటా మోటర్స్, కర్నాటకలో టొయోటా కిర్లోస్కర్ ఉత్పాదక కేంద్రాలున్నాయి. ఇక మహారాష్ట్రలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్వ్యాగన్, స్కోడా ఆటో, హ్యుందాయ్ తయారీ కేంద్రాలున్నాయి. రాజస్థాన్లో హోండా కార్స్, తమిళనాడులోని చెన్నైలో బీఎండబ్ల్యూ, మహీంద్రా, హ్యుందాయ్, నిస్సాన్ మోటర్స్, రెనాల్ట్, డాట్సన్, సిట్రియాన్, బీవైడీ, ఏపీలో సుజుకీ మోటర్స్, కియా కార్లు తయారవుతున్నాయి.
ప్రయత్నించని రాష్ట్ర సర్కారు
ఆటోమొబైల్ రంగంలో తెలంగాణను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. మెదక్లో రక్షణ రంగ వాహనాల పరిశ్రమ ఉండగా, జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా, పటాన్చెరూలో డెక్కన్ ఆటోకు చెందిన కమర్షియల్ వాహనాలు తయారవుతున్నాయి. హ్యుందాయ్ కంపెనీ అదే ప్రాంతంలో టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నది. దీంతోపాటు అనేక యాన్సిలర్ యూనిట్లు కూడా ఇక్కడ కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమను రాష్ర్టానికి తేవడం ద్వారా అనేక ఇతర కంపెనీలను కూడా ఆకర్షించవచ్చని అప్పటి ప్రభుత్వం భావించింది.
ఇందులో భాగంగానే టెస్లా కంపెనీ ప్రతినిధులతో అప్పటి మంత్రి కేటీఆర్ అమెరికాలో సమావేశమయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల భారత్లో పరిశ్రమ ఏర్పాటుకు టెస్లా వెనుకడుగేసింది. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో సదరు కంపెనీ మన దేశంలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అయితే ఈ మేరకు చొరవ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనిపించడం లేదని ఆటో రంగ వర్గాలు అంటున్నాయి. టెస్లా వంటి పరిశ్రమలు రాష్ర్టానికొస్తే తెలంగాణ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుందని చెప్తున్నారు. ఆయా రాష్ర్టాల ప్రతినిధులు కంపెనీతో చర్చలు జరుపుతుంటే, మన రాష్ట్రం నుంచి అటువంటి ప్రయత్నం జరగడం లేదని వాపోతున్నారు.