IT | పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను కోతలుండేవి. వీటివల్ల పన్ను చెల్లింపుదారులకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయేది. తద్వారా పన్ను మినహాయింపులు, పొదుపునకు వీలుండేది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పన్ను శ్లాబులను సవరించిన సంగతీ విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ నూతన ట్యాక్స్ విధానంపై స్పష్టత కూడా ఇచ్చారు. దీన్నిబట్టి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ట్యాక్స్ పేయర్లకు కొన్ని రకాల పన్ను ఆదా పెట్టుబడులు దూరం కానున్నాయి. ఎప్పుడైనాసరే పెట్టుబడిపై పొందే ప్రతిఫలం, ఆ పెట్టుబడికి ఉండే పన్ను ప్రయోజనాల ఆధారంగానే సదరు పెట్టుబడి ఉత్తమమైనదా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. పెట్టుబడులపై పన్ను ప్రభావం మూడు సందర్భాల్లో ఉంటుంది.
పెట్టుబడి సమయంలో, దానిపై లాభాలు అందుకున్నప్పుడు, ఆ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు పన్నులుంటాయి. అయితే వీటిలో చివరి రెండు సందర్భాల్లో పన్ను.. పాత, కొత్త విధానాల్లో దాదాపు ఒకేరకంగా ఉంటున్నదని నిపుణులు చెప్తున్నారు. నిజానికి చాలా పెట్టుబడులు వాటికి వర్తించే పన్ను కోతల వల్లే విశేష ఆదరణను పొందగలిగాయి. వివిధ రకాల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ కొత్త పన్ను విధానంలో ఈ అవకాశం లేదు. అంతేకాదు ఎన్నో ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ కూడా దూరమవుతున్నాయి. అవేంటో చూద్దాం..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది సెక్షన్ 80సీ కింద ఆదరణ ఉన్న పెట్టుబడి. పాత పన్ను విధానంలో దీనికి అన్ని రకాల మినహాయింపులున్నాయి. కానీ కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనాలుండవు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్) కూడా సెక్షన్ 80సీ కింద ప్రముఖమైనదే. ఇందులో మార్కెట్ లింక్డ్ రిటర్నులను మదుపరులు అందుకోవచ్చు. అయితే కొత్త పన్ను విధానంలో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడి లాభదాయకం కాదు.
సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్ల వంటి జీవిత బీమా పాలసీలపట్ల కొత్త పన్ను విధానంలో ఆసక్తి అంతంతమాత్రమే. పాత పన్ను విధానంలో కలిగే లాభాలు కొత్త పన్ను విధానంలో ఉండవు. వీటిని ఎంచుకుంటే పన్ను సహిత ఆదాయం పరిధిలోకే వస్తాయి.
వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్ రేటు ప్రకారం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)కు పన్నులు వర్తిస్తాయి. కాబట్టి కొత్త పన్ను విధానంలో ఎన్ఎస్సీ.. తెలివైన పెట్టుబడి అనిపించుకోదు. సెక్షన్ 80సీ ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలి.
ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) ఫిక్స్డ్ రిటర్నులను అందిస్తాయి కాబట్టి వీటికి మదుపరుల్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. పైగా ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. కానీ కొత్త పన్ను విధానంతో ఎఫ్డీలకు ఆదరణ పడిపోనున్నది.