Salary | ముంబై, ఏప్రిల్ 24: ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇందులో 2 వేల మంది భారతీయులూ పాల్గొన్నారు. ఈ వివరాలను ఏడీపీ సోమవారం విడుదల చేసింది. వీరిలో 90 శాతం మంది ఈ ఏడాది జీతాలు ఎంతోకొంత పెరుగుతాయన్న ఆశతో ఉండగా, వారిలో 20 శాతం మంది 4-6 శాతం పెరగొచ్చంటున్నారు. ఇక 19 శాతం మంది 10-12 శాతం హైక్ ఉంటుందన్న అంచనాల్ని కనబర్చారు. కాగా, ఒకవేళ ఈ ఏడాది వేతనాలు పెరుగకపోయినా.. మెరిట్ బోనస్, పెయిడ్ హాలిడేస్ లేదా ట్రావెల్ కాంపెన్సేషన్ వంటివైనా వస్తాయని దేశంలోని 65 శాతం మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది.
అయితే ఇదే సమయంలో పెరిగిన ఖర్చులు, పడిపోతున్న లాభాలు ఆయా కంపెనీలకు ఇబ్బందికరంగా మారాయని, దీంతో జీతాల పెంపు సంస్థలకు కత్తిమీద సామే అయ్యేలా ఉందని సర్వే పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో జీతాలు పెరుగకపోతే ఉద్యోగులు సంస్థల్ని మార్చే దిశగా అడుగులు వేసే వీలు కూడా లేకపోలేదని ఏడీపీ ఇండియా ఎండీ రాహుల్ గోయల్ అన్నారు. కాగా, గత ఏడాది భారత్లో 78 శాతం వర్కర్స్కు సగటున 4-6 శాతం జీతాలు పెరిగాయని ఈ సందర్భంగా ఏడీపీ గుర్తుచేసింది.