Kia Carens | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ ఇటీవల ఆవిష్కరించిన కరెన్స్ మోడల్ కారు పట్ల కస్టమర్ల నుంచి మంచి సానుకూల స్పందన కనిపించింది. రూ.25 వేలు చెల్లించి ఈ కారు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 14న బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 7,738 కార్ల కోసం బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రీమియం క్లాస్ మల్టీ పర్పస్ వెహికల్ కరెన్స్లో ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్లు ఉన్నాయి. కియా మోటార్స్ నుంచి విపణిలోకి వచ్చిన నాలుగో మోడల్ కారు కరెన్స్. ఇప్పటి వరకు సెల్టోస్, కార్నివాల్, సొనెట్ మోడల్ కార్లు విపణిలోకి వచ్చాయి.
కియా మోటార్స్ ఇప్పటికైతే కరెన్స్ ధర వెల్లడించలేదు. ప్రీమియం ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్లతో కూడిన ట్రిమ్ రేంజ్లోనే ఈ కారు వస్తుంది. శక్తిమంతమైన హై సేఫ్టీ ప్యాకేజీ స్టాండర్డ్తో మొత్తం ఐదు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి ఎక్స్ఎల్-6, హ్యుండాయ్ అల్కాజార్, టయోటా క్రిస్టా వంటి మోడల్ కార్లతో కియా కరెన్స్ పోటీ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
10.25 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. టచ్ స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్పై పని చేస్తుంది. కియా కనెక్ట్, రైడర్ల కోసం స్వచ్ఛమైన ఎయిర్ ఫ్యూరిఫయర్ అందుబాటులో ఉంటాయి. వన్టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్, స్కై లైట్ సన్రూఫ్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీం 1.4 టీ జీడీఐ పెట్రోల్ వేరియంట్, 1.5 సీఆర్డీఐ వీజీటీ డీజిల్ అనే మూడు పవర్ ట్రైన్ వెర్షన్లలో లభ్యం కానుంది. మూడు ట్రాన్సిమిషన్ ఆప్షన్లు, 6-మాన్యువల్ ట్రాన్సిమిషన్, 7డీసీటీ, 6-ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. కియా మోటార్స్ ఇండియా సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ టాయ్ జిన్ పార్క్ మాట్లాడుతూ తొలి రోజు కస్టమర్ల నుంచి కరెన్స్కు లభించిన స్పందన తమకు ఆనందాన్ని కలిగించిందన్నారు.