హైదరాబాద్, అక్టోబర్ 6: వెయ్యి కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన కుబేరులతో ఈ ఏడాదికిగాను ఇటీవల విడుదలైన ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్’లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన 69 మంది ఉన్నారు. వీరందరి సంపద విలువ రూ.3,79,200 కోట్లుగా ఉన్నది. గతేడాదితో పోల్చితే 54 శాతం ఎగబాకడం గమనార్హం. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ర్టాల శ్రీమంతుల జాబితాను ఐఐఎఫ్ఎల్, హురున్ విడుదల చేశాయి. ఇందులో దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళీ దివీ&ఆయన కుటుంబం రూ.79,000 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, నిరుడుతో చూస్తే ఏకంగా సంపద 61 శాతం ఎగిసింది. ఇదిలావుంటే 2020లో తెలంగాణ, ఏపీల్లో 9 మంది డాలర్ బిలియనీర్లుండగా, ఈ ఏడాది 15 మందికి పెరుగడం విశేషం. ఇక ఈసారి జాబితాలోకి 13 మంది కొత్తవారు రాగా, వీరందరి సంపద విలువ రూ.49,500 కోట్లుగా ఉన్నది. అందులో తొలి రెండు స్థానాల్లో రూ.12,000 కోట్లతో జీఏఆర్ సంస్థకు చెందిన జీ అమరేందర్రెడ్డి, రూ.9,700 కోట్లతో సువెన్ ఫార్మా నుంచి వెంకటేశ్వర్లు జాస్తి ఉన్నారు. వీరిద్దరూ తెలుగు రాష్ర్టాల్లోని టాప్-10 సంపన్నుల్లో కూడా ఉన్నారు. అలాగే తర్వాతి స్థానాల్లో రూ.7,500 కోట్లతో ఏ ప్రతాప్రెడ్డి (బాలాజీ అమైన్స్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్), రూ.4,700 కోట్లతో దాసరి ఉదయ్కుమార్రెడ్డి (తాన్లా ప్లాట్ఫామ్స్), రూ.3,800 కోట్లతో అనిల్కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో గ్రూప్), రూ.3,800 కోట్లతో మహేశ్ కొల్లి (గ్రీన్కో గ్రూప్) ఉన్నారు. మొత్తం 69 మందిలో 30 శాతం ఫార్మా రంగానికి చెందినవారే. అలాగే ఇద్దరు మహిళలుండగా, రూ.7,700 కోట్లతో మహిమ దాట్ల&కుటుంబం ముందున్నది.
తెలుగు రాష్ర్టాల్లోని అపర కుబేరుల్లో 56 మంది హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. ఇది 81 శాతానికి సమానం. రంగారెడ్డి జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురున్నారు. ఇకపోతే అత్యధికంగా సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన ముగ్గురు, విర్చో లాబొరేటరీస్కు చెందిన ముగ్గురికి ఈ జాబితాలో చోటు దక్కింది. సింఘానియా సంపన్నుల సంపద విలువ రూ.5,100 కోట్లుండగా, విర్చో సంస్థవారు రూ.4,400 కోట్ల సంపదతో ఉన్నారు. కాగా, గత పదేండ్లలో తెలంగాణ, ఏపీల్లోని అపర కుబేరుల సంఖ్య 21 రెట్లు ఎగిసి 3 నుంచి 69కి చేరిందని ఈ సందర్భంగా హురున్ ఇండియా ఎండీ అనస్ రహ్మాన్ జునైద్ తెలిపారు. వచ్చే ఐదేండ్లలో ఇది 200 మందికి చేరవచ్చని అంచనా వేశారు.