IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో సరికొత్త రికార్డు నమోదైంది. సోమవారం అర్థరాత్రి ముగిసే సమయానికి 6.77 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16.1 శాతం మంది ఎక్కువగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఈ ఏడాది కొత్తగా తొలిసారి 53.67 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేశారు.
ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు కావడంతో జూలై 31న వేతన జీవులు ఈ-పోర్టల్ పై పోటెత్తారు. ఫలితంగా చివరి రోజు 10 శాతం మంది లోపు ఐటీఆర్ దాఖలు చేశారు. మొత్తం 64.33 లక్షల మంది చివరి రోజు ఐటీఆర్ ఫైల్ చేశారని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
ఆదివారం అర్థరాత్రి వరకు ఆరు కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2021-22తో పోలిస్తే గత నెల 30కే రికార్డు స్థాయిలో ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి. గతేడాది (2021-22)లో 5.83 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. ఇంతకుముందుతో పోలిస్తే టాక్స్ బేస్ పెరుగుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయని ఆదాయం పన్ను విభాగం వెల్లడించింది.
మొత్తం ఐటీఆర్ల్లో 46 శాతానికి పైగా ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఫైల్ చేస్తే, మిగతా వారు ఆఫ్ లైన్లో పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య 4,96,559 ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి. సోమవారం సాయంత్రం 04:35:06 గంటల (సెకన్)కు అత్యధికంగా 486, నిమిషానికి (17:54) గంటలకు 8,622 మంది ఐటీఆర్ ఫైల్ చేశారని ఆదాయం పన్ను విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.