న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున జరుగుతున్న స్పెక్ట్రం వేలానికి తొలిరోజైన మంగళవారం రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. 5జీ తరంగాల కోసం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, సునీల్ భారతీ మిట్టల్ నాయకత్వంలోని భారతీ ఎయిర్టెల్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్లు పోటీపడ్డాయి.
ప్రస్తుత 4జీ కంటే 5జీలో టెలికం సేవల వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో టెలికం సంస్థలు 5జీ స్పెక్ట్రంను దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా, ఈసారి 700 మెగాహెట్జ్ శ్రేణిలోని తరంగాల కోసం కూడా బిడ్లు వచ్చినట్టు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. వీటి విలువ రూ.39,270 కోట్లుగా ఉండొచ్చన్నారు. కాగా, 2015 రికార్డుల (రూ.1.09 లక్షల కోట్లు)ను అధిగమిస్తూ ఈసారి అంచనాలను మించి వేలం మొదలైన తొలిరోజే రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖలైనట్టు చెప్పారు. అయితే ఏ సంస్థ ఎంత స్పెక్ట్రంను పొందనున్నదన్న వివరాల్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ వేలంలో వొడాఐడియా కూడా పోటీ పడుతు న్నది. తొలిరోజు 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ శ్రేణిలో అత్యధిక బిడ్లు వచ్చాయి.
ఆగస్టు 14కల్లా కేటాయింపులు
వచ్చే నెల ఆగస్టు 14కల్లా ఈ వేలంలో స్పెక్ట్రంను గెల్చుకున్న సంస్థలకు కేటాయింపులు జరిగిపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్లో 5జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈసారి వేలంలో హైఫ్రీక్వెన్సీ బ్యాండ్ 26 గిగాహెట్జ్తోపాటు మధ్యశ్రేణి బ్యాండ్ 3300 మెగాహెట్జ్, లోఫ్రీక్వెన్సీ బ్యాండ్లు 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెట్జ్ తరంగాలకూ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. వీటన్నిటి విలువ రూ.4.3 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా ఈ వేలం కొనసాగనున్నది.