Insurance Sector | న్యూఢిల్లీ, మార్చి 18: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో బీమా రంగం దూసుకుపోతున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో ఈ రంగంలోకి అక్షరాల రూ.54 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. బీమా రంగంలోకి వచ్చే ఎఫ్డీఐల నిబంధనలను మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సందర్భంగా తెలిపారు. 2014లో బీమా రంగంలోకి ఎఫ్డీఐల పరిమితిని 26 శాతానికి పెంచిన మోదీ సర్కార్..ఆ మరుసటి ఏడాది 49 శాతానికి సవరించింది.
విదేశీ పెట్టుబడులకు రాచబాటను వేస్తున్న కేంద్ర సర్కార్..2021లో ఏకంగా ఎఫ్డీఐల పరిమితిని 74 శాతానికి పెంచింది. దీంతో విదేశీ సంస్థలు భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. దీంతో డిసెంబర్ 2014 నుంచి జనవరి 2024 నాటికి బీమా రంగంలోకి మొత్తంగా రూ.53,900 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. మరోవైపు, బీమా మధ్యవర్తుల విభాగంలోకి ఎఫ్డీఐలను 100 శాతం అనుమతించిన విషయం తెలిసిందే.
పెరిగిన బీమా సంస్థలు..
ఇదే సమయంలో దేశంలో బీమా సేవలు అందించే సంస్థల సంఖ్య కూడా పెరిగింది. 2014లో 53గా ఉన్న బీమా సంస్థలు ఈ ఏడాది నాటికి 70కి చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ బీమా వినియోగం మాత్రం పెరగడం లేదు. 2013-14లో 3.9 శాతంగా ఉన్న సరాసరి బీమా వినిమయం 2022-23 నాటికి కేవలం 4 శాతానికి చేరుకున్నది. కానీ, బీమా సాంద్రత 52 డాలర్ల నుంచి 92 డాలర్లకు పెరగడం విశేషం. 2013-14లో రూ.21 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న బీమా రంగ సంస్థల ఆస్తుల విలువ మూడింతలు పెరిగి రూ.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే మొత్తం బీమా ప్రీమియం వసూళ్లు కూడా రెండింతలు పెరిగి రూ.3.94 లక్షల కోట్ల నుంచి రూ.10.4 లక్షల కోట్లకు చేరాయి.
బీమా రంగంలోకి ప్రైవేట్ సంస్థల రాకను అనుమతిస్తూ ఆగస్టు 2000లో కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అలాగే వీటిలో విదేశీ సంస్థలు 26 శాతం వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కూడా కల్పించింది. దీంతో విదేశీ సంస్థలు క్రమంగా పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. దీంట్లో భాగంగా జూరిచ్ ఇన్సూరెన్స్-కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు మధ్య కుదిరిన ఒప్పందంతో దేశీయ బీమా రంగంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే కావడం విశేషం. గత నెలలో జాయింట్ వెంచర్లో వాటాను 70 శాతానికి పెంచుకుంటున్నట్లు జూరిచ్ ప్రకటించిన విషయం తెలిసిందే.