Recession Job Losses | కరోనా సవాళ్లు.. అటుపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో వివిధ వస్తువుల ధరలు పైపైకి దూసుకెళ్లాయి. ఫలితంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడంతో నిధుల లభ్యత తగ్గింది.. దీంతో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే మాంద్యం ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్త కంపెనీల్లో 50 శాతం కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడానికి ప్లాన్లు వేస్తున్నాయి. ప్రతియేటా సిబ్బంది, ఉద్యోగులకిచ్చే బోనస్లు తగ్గించాలని, కొత్త జాబ్ ఆఫర్లను రద్దు చేసేస్తున్నాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ PwC నిర్వహించిన PwC ‘Pulse: Managing business risks in 2022’ survey ప్రకారం అమెరికాలో 50 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోత విధిస్తామని చెప్పాయి. ప్రతిభావంతులను కాపాడుకోవడం, కొత్త నియామకాలు చేపట్టడం ఆందోళనకరమేనని చెబుతున్నాయి.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిలో నైపుణ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్లు చెప్పారు. బోనస్ల్లో కోత విధిస్తున్నట్లు 46 శాతం కంపెనీలు, కొత్త ఉద్యోగాల ఆఫర్లు ఇవ్వబోమని 44 శాతం సంస్థలు చెబుతున్నాయని పీడబ్ల్యూసీ పల్స్ నివేదిక చెబుతున్నది.
మైక్రోసాఫ్ట్, మెటా (ఫార్మర్లీ ఫేస్బుక్) వంటి బడా కంపెనీలు అమెరికాలో గత నెలాఖరు వరకు 32 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించేయడం టెక్నాలజీ రంగంలో విపత్కర పరిస్థితులను తెలియజేస్తున్నది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 25 వేల మందికి పైగా స్టార్టప్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోయారు. 12 వేల మందికి పైగా ఉద్యోగులను స్టార్టప్ సంస్థలు ఇండ్లకు సాగనంపాయి. ఇటువంటి ముందస్తు చర్యలు కొన్ని పరిశ్రమల్లో మాత్రమే తీసుకుంటున్నారని పీడబ్ల్యూసీ తెలిపింది.
కన్జూమర్ మార్కెట్స్, టెక్నాలజీ, మీడియా, టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీలు కార్మికుల కొరతను అధిగమించేందుకు ఆటోమేషన్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని పీడబ్ల్యూసీ నివేదికలో పేర్కొంది. హెల్త్కేర్ రంగంలో భారీ స్థాయిలో ప్రతిభావంతుల కొరత సవాళ్లు నెలకొన్నాయి. హెల్త్కేర్ రంగ సంస్థల్లో మానేసిన నిపుణుల స్థానే కొత్త వారి నియామకానికి ఆయా సంస్థలు చర్యలు చేపట్టాయి. ఈ సర్వేలో 700 మందికి పైగా యూఎస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగినా కొద్దీ వ్యాపార వృద్ధికి అవసరమైన వ్యూహ రచనలో 83 శాతం మంది ఎగ్జిక్యూటివ్లు దృష్టి పెడతామన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పీడబ్ల్యూసీ అమెరికా ట్రస్ట్ సొల్యూషన్స్ కో లీడర్ వైస్ ప్రెసిడెంట్ కాథ్రిన్ కామిన్స్కై వ్యాఖ్యానించారు. దాదాపు 63 శాతం సంస్థల యాజమాన్యాలు ఉద్యోగుల కొరతను తగ్గించుకోవడానికి ప్లాన్లలో మార్పులు చేస్తున్నాయి.