ముంబై, జనవరి 6: స్టాక్ మార్కెట్లకు నూతన సంవత్సరం అచ్చిరాలేదు. ప్రారంభ రోజు పెరిగినప్పటికీ..ఆ మరుసటి రోజు నుంచి భారీగా పతనం చెందింది. వడ్డీరేట్ల పెంపుపై వెనుకంజ వేయబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించిన నాటి నుంచి సూచీలు దిగువముఖం పట్టాయి. గత మూడు సెషన్లలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,400 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక, టెక్నాలజీ రంగ షేర్లలో క్రయ విక్రయాలు భారీగా జరగడం ఇందుకు కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది. దీంతో రూ.5 లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది.
హైదరాబాద్, జనవరి 6: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ.. తమ న్యూ జీవన్ శాంతి ప్లాన్లో సవరణలు చేసింది. యాన్యుటీ రేట్లను పెంచామని, గురువారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని శుక్రవారం స్పష్టం చేసింది. అలాగే అధిక కొనుగోలు ధర కోసం ప్రోత్సాహకాన్ని కూడా పెంచినట్టు వివరించింది. కాగా, ఇదో సింగిల్ ప్రీమియం ప్లాన్. పాలసీదారుడు సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ డెఫర్డ్ యాన్యుటీల మధ్య ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది.