న్యూఢిల్లీ, డిసెంబర్ 27: టెలికం సంస్థలు 5జీ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్తోపాటు బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై, పుణెలలో 5జీ ట్రయల్స్ నిర్వహించిన ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి రెడీ అవుతున్నాయి. 5జీ టెస్ట్ ప్రాజెక్టు తుది దశకు చేరుకున్నదని, వచ్చే ఏడాది తొలినాళ్ళలోనే ఈ సేవలు ఆరంభించాలనుకుంటున్నట్లు టెలికం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. తొలుత మెట్రో నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందించనుండగా, ఆ తర్వాతి క్రమంలో వీటిని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. 2014-21 మధ్యకాలంలో టెలికం రంగంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 150 శాతం పెరిగి రూ.62 వేల కోట్ల నుంచి రూ.1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
5జీ అంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులో ఉన్నది తెలిసిందే. మనలో చాలామంది ఈ సేవలను పొందుతున్నదీ విదితమే. అయితే త్వరలో మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్న 5జీ.. 4జీ కంటే ఎంతో వేగం. డౌన్లోడ్లో కావచ్చు.. అప్లోడ్లో కావచ్చు.. క్షణంలో పనైపోతుంది. టెలికం సేవలను అత్యంత వేగంగా అందించాలనే ఉద్దేశంతో టెలికం సంస్థలు ఈ 5జీ సేవలను అందించడానికి సిద్ధమయ్యాయి. నిజానికి ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఇప్పుడున్న 4జీ సేవల కింద సెకనుకు 250ఎంబీ డాటా డౌన్లోడ్ అవుతుండగా.. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే సెకనుకు 10జీబీ డాటా డౌన్లోడ్ కానున్నది. ఈ ఐదో తరం సేవలు అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్లలో డాటా డౌన్లోడ్కు బఫరింగ్ అవకాశమే ఉండదు.