Emergency Landing | ఇటీవలి కాలంలో వివిధ సంస్థల విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిత్యకృత్యంగా మారింది. గత 48 గంటల్లో మూడు అంతర్జాతీయ విమాన సర్వీసుల సంస్థల విమానాలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. శుక్ర, శనివారాల్లో కాలికట్, చెన్నై, కోల్కతా నగరాల్లో ఈ ఘటనలు జరిగాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వివిధ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ విమానాల పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ను ఆశ్రయించారు.
షార్జా నుంచి కొచ్చిన్ బయలుదేరిన ఎయిర్ అరేబియా విమానం (జీ9-426)లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తడంతో కాలికట్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన విమానాన్ని విమానాశ్రయ స్టాండ్కు తరలించారు.
శనివారం అడ్డిస్ అబాబా నుంచి బ్యాంకాక్కు బయలుదేరిన ఇథోపియన్ ఎయిర్లైన్స్ విమానం.. ప్రెషరైజేసన్ సమస్యతో కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ను ఆశ్రయించింది. అంతకుముందు శుక్రవారం హైడ్రాలిక్ సమస్య వల్ల శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం.. చెన్నైలో అత్యవసరంగా ల్యాండయింది.
శనివారం ఎయిర్ అరేబియా విమానం హైడ్రాలిక్ సమస్య వల్ల కొచ్చిన్లో, ఇథోపియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రెషరైజేషన్ ఇష్యూ వల్ల కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ను ఆశ్రయించాయని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. హైడ్రాలిక్ సమస్య తలెత్తడం వల్లే శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసరంగా చెన్నైలో ల్యాండయిందని ఆ అధికారి చెప్పారు.
ఈ ఘటనలన్నింటిపై సవివరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్.. సాంకేతిక సమస్య తలెత్తడంతో కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండయిందని ఆ సంస్థ తెలిపింది. హైదరాబాదీ ప్రయాణికులను తరలించడానికి మరో విమానాన్ని కరాచీకి పంపినట్లు ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.