న్యూఢిల్లీ, జూలై 4: లగ్జరీ, సిన్ ఉత్పత్తులపై టాప్ జీఎస్టీ శ్లాబ్ 28 శాతాన్ని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. సోమవారంనాడిక్కడ అసోచామ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ మనది వర్థమాన ఆర్థిక వ్యవస్థ అయినందున, ప్రజల ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉన్నందున లగ్జరీ, సిన్ ఐటెమ్స్పై అధిక పన్నులుంటాయన్నారు. కానీ 5,12,18 శాతంగా ఉన్న మరో మూడు శ్లాబ్ల్ని రెండుగా తగ్గించే అంశమై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదన్నారు. అటుతర్వాత దేశం వృద్ధిచెందుతున్న తీరును గమనించి, ఒక శ్లాబ్కు తగ్గించే సామర్థ్యం ఉంటుందో లేదో చూడాలన్నారు.
ఇలా మూడు శ్లాబ్స్ను ఒకటిగా తగ్గించడం చాలా క్లిష్టమైన సవాలు అని అన్నారు. ప్రస్తుతం నిత్యావసరాలపై జీఎస్టీ మినహాయింపు లేదా 5 శాతం కనిష్ఠ శ్లాబ్ రేట్ను విధిస్తుండగా, కార్ల వంటి లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు తదితర సిన్ ఉత్పత్తులపై 28 శాతం గరిష్ఠ రేట్ను విధిస్తున్నారు. 28 శాతం శ్లాబ్పై సెస్ కూడా వేస్తున్నారు. ఈ నాలుగు శ్లాబ్స్ కాకుండా బంగారం, ఆభరణాలపై 3 శాతం ప్రత్యేక రేట్, కట్, పాలిష్డ్ వజ్రాలపై 1.5 శాతం రేట్ చొప్పున జీఎస్టీ ఉంది. పన్ను రేట్లను హేతుబద్దీకరించాలని, శ్లాబ్లను విలీనం చేయాలని, మినహాయింపుల జాబితాను సమీక్షించాలని, ముడి ఉత్పత్తికంటే తుది ఉత్పత్తిపై పన్ను రేట్ తక్కువగా ఉన్నవాటి డ్యూటీ ఇన్వెర్షన్ను సరిచేసే అంశాలపై సూచనలు ఇచ్చేందుకు ఒక మంత్రుల గ్రూప్ను ఇదివరకే జీఎస్టీ కౌన్సిల్ నియమించింది. ఈ గ్రూప్ సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా గత నెలలో పలు ఐటమ్స్పై జీఎస్టీ కౌన్సిల్ మినహాయింపుల్ని ఎత్తేసింది.